ఆమె నాకే సొంతం... అల్వాల్ హత్య కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు

ABN , First Publish Date - 2020-12-13T23:56:50+05:30 IST

కనగరాజుకు సదరు యువతితో 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆమెతో ప్రత్యేకం ఓ ఇంట్లో కాపురం పెట్టాడు. అంతవరకు వీరిద్దరి వ్యవహారం గుట్టుగా సాగుతూవస్తోంది.

ఆమె నాకే సొంతం... అల్వాల్ హత్య కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు

హైదరాబాద్: అల్వాల్‌‌కు చెందిన కనగరాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అదే మహిళతో శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ విషయం కనగరాజుకు తెలియడంతో ఇరువురు మధ్య గొడవలు జరిగాయి. అయితే ఆరు నెలల కిందట శ్రీకాంత్‌రెడ్డి ఆమెను తనతో తీసుకుని పరారయ్యాడు. వీరి ఆచూకి తెలుసుకున్న కనగరాజు ఇద్దరి పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. యువతితో పాటు శ్రీకాంత్‌రెడ్డిని కనగరాజు బంధించి చిత్రహింసలు పెట్టి చంపాడని స్థానికులు చెబుతున్నారు. కనగరాజుకు సదరు యువతితో 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆమెతో ప్రత్యేకంగా ఓ ఇంట్లో కాపురం పెట్టాడు. అంతవరకు వీరిద్దరి వ్యవహారం గుట్టుగా సాగుతూవస్తోంది. ఇటీవల యువతి నివాసముంటున్న ఇంటి ఎదురుగా మరో ఇంట్లో శ్రీకాంత్‌రెడ్డి అద్దెకు దిగాడు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్‌రెడ్డికి యువతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అంతటితో ఆగలేదు. చట్టాపట్టాలేసుకుని వరంగల్, విజయవాడ తదితర పట్టణాల్లో చక్కర్లు కొట్టారు. వీరిద్దరి వ్యవహారం కాస్త కనగరాజు చెవిలో పడింది. ఇంకేముంది కనగరాజు అగ్గిమీదగుగ్గిలమయ్యాడు. కనగరాజుకు విషయం తెలియడంతో శ్రీకాంత్‌రెడ్డి, యువతి ఏకాంతంగా కలుసుకోవడానికి అన్నీ దారులు మూసుకుపోయాయి. అయితే ఆరు నెలల క్రితం వీరిద్దరూ కనగరాజు కన్నుగప్పి వరంగల్‌‌కు పారిపోయారు. 


ఆనోటా ఈ నోటా పడి విషయం కాస్త కనగరాజు చెవితో పడింది. వెంటనే తన అనుచరులతో కనగరాజు ఆ జంటను నగరానికి తీసుకువచ్చాడని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిని వేరు వేరు గదుల్లో బంధించారు. అంతేకాదు శ్రీకాంత్‌రెడ్డిని చిత్రహింసలు కూడా పెట్టాడని చెబుతున్నారు. శ్రీకాంత్ ఎంతకీ వినకపోవడంతో ఈ నెల 6న హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం మరో ఇద్దరి సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని ఆల్మాస్‌పేట స్మశానవాటికలో పూడ్చివేసినట్లు చెబుతున్నారు. కనగరాజు ఈ వ్యవహారమంతా తనకున్న రాజకీయ పలుకుబడితో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కనగరాజుకు నేర చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2020-12-13T23:56:50+05:30 IST