అర్ధరాత్రి ఆడపిల్లలను పంపేశారు!

ABN , First Publish Date - 2022-03-21T07:40:15+05:30 IST

అర్ధరాత్రి ఆడపిల్లలను పంపేశారు!

అర్ధరాత్రి ఆడపిల్లలను పంపేశారు!

అధికారుల ఒత్తిడితో ఆందోళన విరమణ 

కారుచీకట్లో పాత క్యాంప్‌సకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినుల తరలింపు 

గదుల్లో పాములు... భయంతో పరుగులు.. అక్కడికి వెళ్లలేమంటూ రోజంతా ఆందోళన 

ఉంటే ఉండండి.. లేదంటే బయటకు వెళ్లండి.. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ గద్దింపులు 

విద్యార్థినులపై చేయి చేసుకునేందుకు యత్నం.. న్యాయం చేసేవరకూ కదలబోమన్న విద్యార్థులు 

భోజనం చేయకుండా ఆందోళన కొనసాగింపు.. అర్ధరాత్రి వరకూ నిరసన


కడప, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులను రాత్రి వేళ క్యాంపస్‌ ఖాళీ చేయించారు. ఒంగోలు నుంచి వచ్చిన విద్యార్థుల కోసం హడావుడిగా వారందరినీ దూరంగా ఉన్న పాత క్యాంప్‌సకు తరలించారు. శిథిలావస్థకు చేరి, కనీస సౌకర్యాలు లేక, పాములతో నిండిన ఆ క్యాంప్‌సలోకి వెళ్లబోమంటూ విద్యార్థినులు నిరసన గళమెత్తారు. సర్దిచెప్పాల్సిన ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి విద్యార్థినుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ‘‘ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి’’ అంటూ ఆందోళనకు దిగిన ఓ విద్యార్థినిపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. భోజనం కూడా చేయకుండా అర్ధరాత్రి వరకూ ఏకధాటిగా 12 గంటలు నిరసన కొనసాగించారు. దీంతో ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో 6,500 మంది విద్యార్థులు ఉన్నారు. ఒంగోలులో కనీస సౌకర్యాలు లేవని పీయూసీ-1, పీయూసీ-2, ఇంజనీరింగ్‌-1కు చెందిన 3,300మందిని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి మార్చారు. వారికి వసతి కోసం ఇక్కడి విద్యార్థినులను క్యాంప్‌సకు దూరంగా పాత క్యాంపస్‌ (డ్యాం షెడ్స్‌)కు తరలించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రెండేళ్లుగా వాడుకలో లేక శిథిలావస్థలో ఉన్న ఆ భవనాలకు అంతంతమాత్రంగా మరమ్మతులు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పాత క్యాంపస్‌ గదుల్లోకి వెళ్లిన విద్యార్థినులకు ఫ్యాన్లకు వేలాడుతున్న పాములు, శుభ్రం చేయని మరుగుదొడ్లు దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఉదయం వారు బయటకు రాకుండా యాజమాన్యం గేట్లకు తాళాలు వేయడంతో ఆగ్రహంతో గేట్లు తోసుకుని అడ్మినిస్ర్టేషన్‌ బంగ్లాకు చేరుకుని నిరసన చేపట్టారు. 


డైరెక్టర్‌ తీరుతో ఆగ్రహం 

విద్యార్థినులకు సర్ది చెప్పాల్సిన  ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి... ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్లి ‘‘ఉంటే ఉండండి.. లేదంటే బయటకు వెళ్లండి’’ అంటూ గద్దించారు. విద్యార్థినులపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో వారు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా దిగిరాలేదు. వీసీ హేమాద్రిరెడ్డి సోమవారం వస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పినా పట్టించుకోలేదు. విద్యార్థుల సర్దుబాటులో భాగంగా పాత క్యాంప్‌సకు పంపించామే తప్ప మరో కారణం లేదని డైరెక్టర్‌ సంధ్యారాణి వివరణ ఇచ్చారు. కాగా, ఆందోళనను విరమించకపోతే కళాశాలకు సెలవులు ప్రకటిస్తామని, ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టి ఇళ్లకు పంపుతామని, వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటామని కళాశాల అధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 12గంటల వరకూ ఆందోళన కొనసాగించిన విద్యార్థినులు... అధికారుల ఒత్తిడితో అయిష్టంగానే తమ నిరసనను విరమించుకున్నారు. 

Updated Date - 2022-03-21T07:40:15+05:30 IST