సెప్టిక్ ట్యాంక్ కబ్జా.. నిర్మాణం పూర్తి చేసి రంగులు
ABN , First Publish Date - 2022-01-21T17:04:54+05:30 IST
ఫతేనగర్ డివిజన్ జింకలవాడ నాలా పక్కన స్థలం, సెప్టిక్ ట్యాంక్ను ఆక్రమించి నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని
హైదరాబాద్/ఫతేనగర్: ఫతేనగర్ డివిజన్ జింకలవాడ నాలా పక్కన స్థలం, సెప్టిక్ ట్యాంక్ను ఆక్రమించి నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లర్లు వేసిన నాటినుంచి గోడలు పూర్తయి రంగులు వేసే వరకు వచ్చినా నిర్మాణాన్ని అడ్డుకునే వారే లేకుండా పోయారని వారంటున్నారు. గతంలో తహసీల్దార్ హెచ్చరికతో నిర్మాణ పనులు ఆపారని, ఆమె బదిలీపై వెళ్లగానే మళ్లీ మొదలెట్టారని ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం రెవెన్యూ సిబ్బంది పనులు ఆపించినా షరామామూలే అన్నట్లుగా పనులు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు వైపు రంగులు వేసి లోపల నిర్మాణం పనులు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఆ శాఖకు ఫిర్యాదు చేశా : డిప్యూటీ తహసీల్దార్
ఈ విషయంపై మండల డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ వివరణ కోరగా నాలాను, సెప్టిక్ ట్యాంక్ను ఆక్రమించి కడుతున్న నిర్మాణంపై ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని, వారినుంచి పూర్తి వివరాలు రాగానే చర్యలు చేపడుతామని వివరణ ఇచ్చారు.