తెలంగాణలో 16 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-26T21:43:45+05:30 IST

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది మహిళలను ఊచకోత కోశాడు. మహిళలే లక్ష్యంగా పగ పెంచుకుని అతిదారుణంగా చంపేశాడు

తెలంగాణలో 16 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

హైదరాబాద్: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది మహిళలను ఊచకోత కోశాడు. మహిళలే లక్ష్యంగా పగ పెంచుకుని అతిదారుణంగా చంపేశాడు. ఎట్టకేలకు నరరూప రాక్షసుడైన మైనా రాములును హైదరాబాద్‌, రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడి ఘోరాలు తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు.


వివరాల్లోకి వెళ్తే..

నిందితుడు మైనా రాములు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ భార్య మాత్రం వేరే వాడితో వెళ్లిపోయింది. దీంతో మెంటల్‌గా అప్సెట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మహిళలను టార్గెట్ చేసుకుని దుర్మార్గుడు చెలరేగిపోయాడు. ఇలా 16 మంది మహిళలను పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాడు. 


మొదటి హత్య ఇలా..

2003 నుంచి రాములుపై కేసులు ఉన్నాయి. తొలుతగా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను హత్య చేశాడు. ఇప్పటి వరకు 16 మర్డర్ కేసులు, 4 దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న కేసు ఉంది. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని హత్య చేశాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను చంపేశాడు. నార్సింగ్ మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత కాలం శిక్ష పడింది. అలాగే 2009లో జరిగిన ఓ మహిళ హత్య కేసులో జీవిత ఖైదీ పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడ నుంచి తప్పించుకున్నాడు.


ఎర్రగడ్డ పిచ్చాస్పత్రి నుంచి పరారీ

2011లో ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రి నుంచి రాములు తప్పించుకున్నాడు. పారిపోయిన తర్వాత కూడా తీరు ఏ మాత్రం మారలేదు. తప్పించుకున్న తర్వాత ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013లో బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జైలు నుంచి విడుదలయ్యాక వరుసగా రెండు హత్యలకు పాల్పడ్డాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

Updated Date - 2021-01-26T21:43:45+05:30 IST