ఇద్దరు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2020-11-23T07:32:35+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేస్తే వాటిని అన్యాయంగా తిరస్కరించారంటూ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా,
రేణు సోని, శ్రీనివా్సగౌడ్ల నామినేషన్లు
స్వీకరించాలని న్యాయస్థానం ఆదేశం
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేస్తే వాటిని అన్యాయంగా తిరస్కరించారంటూ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా, వారిద్దరికీ ఊరట లభించింది. చార్మినార్ సర్కిల్లోని ఝాన్సీ బజార్ బీజేపీ అభ్యర్థి రేణు సోని, కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి కె.శ్రీనివాస్గౌడ్ వేసిన నామిషన్లను స్వీకరించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి తన ఇంట్లో.. ఆ ఇద్దరూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్లను విచారించి ఉత్తర్వులు జారీ చేశారు.
కె.శ్రీనివాస్ గౌడ్కు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని ఆయన ప్రత్యర్థి రావుల శేషగిరిరావ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు. రేణు సోనికి కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నారని, పైగా ఆమె బీసీ కాదని.. ఆమె ప్రత్యర్థి ఫర్వీన్ సుల్తానా ఫిర్యాదు చేయడంతో ఆ నామిషన్ను కూడా తిరస్కరించారు. ఈ చర్యలను సవాల్ చేస్తూ వేర్వేరుగా ఆ ఇద్దరు అభ్యర్థులు అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. ‘పిటిషనర్లకు నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా నామినేషన్లు తిరస్కరించడం చట్ట వ్యతిరేకం. శ్రీనివాస్ గౌడ్కు ఇద్దరే పిల్లలున్నారు.
సోనిపై ఇదే తరహాలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఫిర్యాదు వచ్చింది. ఈ కేసు హైకోర్టులో పెడింగ్లో ఉంది. న్యాయ నిర్ధారణ కాకుండానే సోని నామినేషన్ను తిరస్కరించడం చట్ట వ్యతిరేకం. నామినేషన్లను తిరస్కరించే ముందు ఎన్నికల అధికారులు చట్ట నిబంధనలను అమలు చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకం. వెంటనే నామినేషన్లు స్వీకరించేలా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలివ్వాలి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
వాదనల తర్వాత ప్రతివాదులైన గాజులరామారం, ఝాన్సీ జబార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.