అనుమతి లేకుండా హజ్ యాత్ర.. ఏడుగురు అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-02T19:52:10+05:30 IST
మహమ్మారి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రపై సౌదీ అరేబియా సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇద్దరు ప్రవాసులపై దేశ బహిష్కరణ వేటు
రియాద్: మహమ్మారి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రపై సౌదీ అరేబియా సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. విదేశీయులను ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించడం లేదని కూడా స్పష్టం చేసింది. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే ఆహ్వానం ఉంటుందని పేర్కొంది. దీంతో కొందరు అడ్డదారిలో భక్తులను యాత్రకు తరలించే క్రమంలో పట్టుబడుతున్నారు. ఇదే కోవలో తాజాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 17 మంది భక్తులను ఏడుగురు వ్యక్తులు యాత్రకు తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. దీంతో ఆ ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి 105 రోజుల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించారు. కాగా, పట్టుబడిన ఏడుగురిలో ఇద్దరు ప్రవాసులు కూడా ఉన్నారు. దాంతో వారిని శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించారు.
ఇక ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి ఏడాది ఈ యాత్రలో 20 లక్షల మంది భక్తులు పాల్గొంటే... ఈ యేటా కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విదేశీయులను అనుమతించడం లేదు. కేవలం 10 వేల మంది సౌదీ దేశస్థులు మాత్రమే ఈసారి హజ్ యాత్రలో పాల్గొంటున్నారు.