ఖమ్మం జిల్లాలో మరో ఏడుగురికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-28T06:37:27+05:30 IST
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం అధ్వర్యంలో కరోనా వ్యాది నిర్దారణ పరీక్షలు అవసరం మేరకు నిర్వహించకపోయినా హైదరాబాద్లోని ప్రైవేట్
64కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
ఖమ్మం సంక్షేమవిభాగం, జూన్ 27: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం అధ్వర్యంలో కరోనా వ్యాది నిర్దారణ పరీక్షలు అవసరం మేరకు నిర్వహించకపోయినా హైదరాబాద్లోని ప్రైవేట్ ల్యాబ్లలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను హడలేత్తిస్తున్నాయి. జిల్లాలో శనివారం కొత్తగా మరో ఏడుగురికి పాజిటివ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో శనివారం ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు హైదరాబాదువెళ్లి వచ్చినవారికి కరోనా సోకగా ఇటీవల కరోనాతో మరణించిన బ్యాంకు ఉద్యోగి మృతదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన అతడి మిత్రుడికి కరోనా సోకింది. సత్తుపల్లి పోలీసు బెటాలియన్కు చెందిన వంటమనిషి ఇటీవల హైదరాబాదులో విధులు నిర్వహించేందుకు వెళ్లగా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంలో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.
నేలకొండపల్లి మండలానికి చెందిన ఒకరు హైదరాబాదు ఆసపత్రికి వెళ్లగా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలింది. ఖమ్మం నగరంలో మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వైరా మండలానికి చెందిన వ్యక్తి హైదరాబాదు వెళ్లగా అక్కడ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మధిర మండలం దెందుకూరు గ్రామంలో నెలన్నర బాబుకు గుండె, ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దాంతో శిశువును అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీటితో ఖమ్మం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 64కే చేరాయి. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.