రోడ్డు ప్రమాదాల్లో దంపతులు సహా ఏడుగురి మృతి
ABN , First Publish Date - 2021-06-22T07:19:07+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆదివారం రాత్రి , సోమవారం జరిగిన ఏడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో దంపతులు సహా ఏడుగురు మృతి చెందగా, దంపతులు కుమార్తె సహా నలుగురు గాయపడ్డారు. వీరిలో దంపతుల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ దంపతుల దుర్మరణం.. కుమార్తె పరిస్థితి విషమం
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆదివారం రాత్రి , సోమవారం జరిగిన ఏడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో దంపతులు సహా ఏడుగురు మృతి చెందగా, దంపతులు కుమార్తె సహా నలుగురు గాయపడ్డారు. వీరిలో దంపతుల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
బీబీనగర్, జూన్ 21: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందగా, వారి కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా సమీపంలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాచారంలోని హెచ్ఎంటీ కాలనీకి చెందిన సింగవరపు ప్రశాంత్(43), శిరీష(38) దంపతులు కుమార్తె సారా(16)తో కారులో యాదాద్రి క్షేత్ర సందర్శనకు వచ్చారు. హైదరాబా ద్లో ఓ ప్రెవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్, మరో నాలుగు కుటుంబాల సభ్యులు మొత్తం మూడు కార్లలో యాదగిరిగుట్టకు వచ్చి లక్ష్మీనృసింహుల దర్శనం అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా సమీపంలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై గల బస్టాండ్ వద్దకు రాగానే ప్రశాంత్, శిరీష దంపతులు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి కారు అదుపు తప్పింది. కారు నడుపుతున్న ప్రశాంత్ బ్రేక్ వేసే బదులు గా ఎక్సలేటర్ తొక్కటంతో రోడ్డుకు ఎడమ వైపు ఆగిఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా లారీ కిందికి దూసుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ప్రశాంత్, శిరీష దంపతులతోపాటు కుమార్తె శ్రావ్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బీబీనగర్ పోలీసులు క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రశాంత్, శిరీష దంపతులు మృతి చెందారు. కుమార్తె సారా పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మరో కుమార్తె(4) బంధువుల కారులో ఉండడంతో ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు పక్క లారీని నిలిపి నందుకు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఆయుర్వేద డాక్టర్ మృతి
నార్కట్పల్లి: రోడ్డు ప్రమాదంలో హోమియో డాక్టర్ మృతి చెందారు. ఎస్ఐ బి. యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైద్రాబాద్లోని బీఎన్ రెడ్డి నగర్లో నివసిస్తున్న దారెడ్డి సిరియాల్రెడ్డి (80) హోమియోవైద్యుడు. నల్లగొండలోని ఓ దుకాణానికి ఆయుర్వేద ఔషధాలను ఇచ్చేందుకు తన స్కూటర్పై హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరాడు. నార్కట్పల్లిలోని ఫ్లైఓవర్ నుంచి నల్లగొండ సర్వీసు రోడ్డు దిగుతుండగా ప్రమాదవశాత్తు స్కూటర్ వెనుక చక్రం టైరు పేలింది. దీంతో స్కూటర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్కు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో సిరియాల్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సిరియాల్రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సిరియాల్రెడ్డి రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్అలి క్లాస్మేట్ అని పోలీసులు తెలిపారు.
బైక్కు లారీ ఢీకొనడంతో..
తుర్కపల్లి: లారీ బైక్ను ఢీకొనడంతో బైక్ నుంచి జారి పడిన మహిళ మృతి చెందింది. మండలంలోని రుస్తాపూర్ గ్రామానికి చెందిన మొగిరెడ్డి ధర్మారెడ్డి–సుమీలా(40) దంపతులు బైక్పై భువనగిరికి వెళ్తున్నారు. భువ నగిరి నుంచి తుర్కపల్లి వైపు ఎదురుగా వస్తున్న లారీ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు వెనుక సీట్లో ఉన్న సుమీలా కిందపడింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త ధర్మారెడ్డి కన్నీరుమున్నీరుగారోదించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుబాబుతెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
మునగాల: మండలంలోని ఆకుపా ముల గ్రామశివారులో జాతీయ రహదా రిపై గుర్తుతెలియని వాహనం సుమారు 35 సంవత్సరాల యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ యువకుడిని పోలీసులు గుర్తించలేదు. కేసును ఎస్ఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దఅడిశర్లపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. గుడిపల్లి ఎస్ఐ వీరబాబు, స్థానికులు వివరాల ప్రకారం... మండలంలోని ఘనపురం స్టేజీకి చెందిన బాషిపాక ప్రసాద్(30) కూర గాయలు తరలించే మినీ వ్యాన్కు డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తునాడు. కుటుంబసభ్యులకు చెందిన ఓ పంచాయతీకి హాజరై సోమవారం రాత్రి కాలినడకన ఇంటికి వెళుతుండగా, కోనమేకలవారి గూడెం స్టేజీ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
శుభకార్యానికి వెళుతుండగా..
నూతన్కల్: శుభకార్యానికి వెళుతన్న యువకు డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మెంతబోయిన సతీష్ (25) తన అత్తగారి గ్రామమైన ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాళపురంలో జరిగే శుభకార్యానికి బైక్పై వెళుతుండగా, మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామా నికి చెందిన సురేందర్రెడ్డి తన ట్రాక్టర్తో సూర్యా పేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. నూతన్ కల్ పోలీస్స్టేషన్ సమీపంలో సతీష్ మెడకు ట్రాక్టర్ వీల్స్కు తగలడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
ముగ్గురికి గాయాలు..
చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైద రాబాద్ కర్మాన్ఘాట్కు చెందిన పోతరాజు సాయికుమార్ తన కుటుంబ స భ్యులతో కారులో మండలంలోని తీదేడు గ్రామంలోని బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం వచ్చారు. రాత్రి తిరిగి వెళుతుండగా మండలంలోని కుర్మేడు పెట్రోల్బంక్ సమీపంలోకిరాగానే హైదరాబాద్ నుంచి మాచర్ల వైపు వెళుతున్న లారీ కారుతో పాటు మరో డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుని నడుపుతున్న సాయికుమార్తోపాటు, ఆయన తల్లి లక్ష్మి, బంధువు జక్కుల నర్సింహలకు గాయాలయ్యాయి.