అధిక ఫీజులు అరికట్టాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా
ABN , First Publish Date - 2021-07-30T05:53:23+05:30 IST
విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజుల మోత, విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు అన్నారు.
అధిక ఫీజులు అరికట్టాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా
గవర్నర్పేట, జూలై 29: విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజుల మోత, విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలని, అనుమతి లేని పాఠశాలల్ని మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా గురువారం ఏలూరు రోడ్డులో ఉన్న నారాయణ స్కూల్ వద్ద ధర్నా జరిగింది.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్యలకు దిగకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు ఏసుబాబు, నగర నాయకులు ప్రణీత, నరేంద్ర, కార్తీక్, రిజ్వాన్, భార్గవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.
హామీని విస్మరించిన సీఎం
పాయకాపురం: జీవో నెం 77 రద్దు చేసి ప్రతి ఒక్కరికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తింపజేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సోమేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాయంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ . ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పీజీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తిగా రీయింబర్స్మెంట్ దూరం చేశారని వివరించారు. వసతి దీవెన ఇస్తున్నాం అని ప్రచారం చేసుకోవడమే తప్ప విద్యార్థులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు.