జగనన్నా..పేదలను విద్యకు దూరం చేయొద్దన్నా!
ABN , First Publish Date - 2021-12-08T06:16:50+05:30 IST
జగనన్నా..పేదలను విద్యకు దూరం చేయొద్దన్నా!
ఎస్జీఎస్లో మోకాళ్లపై నిలబడి విద్యార్థుల నిరసన
మద్దతు తెలిపిన శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, డిసెంబరు 7: జగనన్నా..పేదలను విద్యకు దూరం చేయొద్దన్నా! అంటూ ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు మంగళవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కొద్ది రోజులుగా ఎస్జీఎస్ కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను కలిసి వారి ఆందోళనకు మద్దతు పలికారు. జగ్గయ్యపేటలో కళాశాల కోసం గెంటేల కుటుంబీకులు భూదానం చేస్తే, ఎంతోమంది కళాశాలకు ఇతోధికం సాయం అందించారని తెలిపారు. ఐదు దశాబ్ధాలుగా కళాశాల వేలాది మందికి ఉన్నత విద్యను అందించిందని తాతయ్య చెప్పారు. కళాశాలను ప్రైవేటీకరించడం వల్ల పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. త్వరలో పూర్వ విద్యార్ధులతో కలిసి ఎస్జీఎస్ కళాశాల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వరరావు, జి.గోపీనాయక్, ప్రణయ తేజ, నర్మద, కల్యాణి, వంశీ, రాజు, ప్రదీప్, జుహీదా, ప్రశాంత్, రాము, అమ్మాజీ, పవన్సాయి పాల్గొన్నారు.