కాంగ్రెస్తో కలిసి నడుద్దామా?
ABN , First Publish Date - 2021-10-23T08:08:32+05:30 IST
: దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్దామని కొందరు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి కడదామని...
పొత్తు వద్దన్న తెలంగాణ, ఏపీ, కేరళ సీపీఎం నాయకులు
కలుద్దామన్న బెంగాల్ సభ్యులు.. ఏచూరి ఎన్నికకూ అభ్యంతరం
న్యూఢిల్లీ, అక్టోబరు 22: దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్దామని కొందరు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి కడదామని మరికొందరు..! ఇలా భిన్నాభిప్రాయాల మధ్య సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో వాడివేడిగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు ఎజెండాగా సమావేశం మొదలైంది. మూడు రోజుల పాటు సాగే ఈ భేటీలో. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరుగనున్న పార్టీ అత్యున్నత సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన రాజకీయ తీర్మానంపై ప్రాథమికంగా చర్చించారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై సెంట్రల్ కమిటీ సభ్యులు రెండుగా చీలిపోయారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారాట్ వర్గం పొత్తును వ్యతిరేకించింది. దీనికి తెలంగాణ, ఏపీతో పాటు పార్టీ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్ర సభ్యులు మద్దతు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు దారులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సభ్యులు మాత్రం కాంగ్రె్సతో కలిసి నడుద్దామని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల వారీగా కాక, మొత్తం జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు బెంగాల్ సహా ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపైనా సమీక్ష జరిగింది. తీవ్ర నిరాశజనక ఫలితాల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా ఏచూరి మూడో దఫా ఎన్నికపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.