Sharad Pawar కన్ను 2024 లోక్‌సభ ఎన్నికలపై!

ABN , First Publish Date - 2021-05-04T22:36:13+05:30 IST

ఐదు శాసన సభల ఎన్నికల ఫలితాలను చూసిన నేషనలిస్ట్ కాంగ్రెస్

Sharad Pawar కన్ను 2024 లోక్‌సభ ఎన్నికలపై!

ముంబై : ఐదు శాసన సభల ఎన్నికల ఫలితాలను చూసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. తమ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తారని తెలిపింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తారని పేర్కొంది. ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 


ప్రతిపక్షాలు ఏకమవడం చాలా అవసరమని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పినట్లు వచ్చిన వార్తలను నవాబ్ మాలిక్ ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యపరచడానికి శరద్ పవార్ కృషి చేశారన్నారు. మరికొద్ది రోజుల్లో శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీలు సంఘటితమయ్యే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారన్నారు. 


పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్న హింసాకాండ గురించి స్పందించాలని కోరినపుడు నవాబ్ మాలిక్ మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలను ఖండించాలన్నారు. గడచిన 100 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉందన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా హింస జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. బాధ్యులను గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగే హింసను ఖండించవలసిందేనన్నారు. విద్వేష రాజకీయాలను బీజేపీ మానుకోవాలన్నారు. 


అంతకుముందు బీజేపీ విడుదల చేసిన ప్రకటనలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే అనేక మంది బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, తొమ్మిది మంది మరణించారని, అనేక మంది గాయపడ్డారని ఆరోపించింది. తమ పార్టీ కార్యకర్తలు నిర్వహించే దుకాణాలను టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించింది. మమత బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ ఆధిక్యత సాధించడంతో టీఎంసీ కార్యకర్తలు రక్తపాతం, హింసాకాండలతో విజయోత్సవాలు నిర్వహించారని మండిపడింది. 


Updated Date - 2021-05-04T22:36:13+05:30 IST