శరవణా స్టోర్స్లో రెండో రోజూ It తనిఖీలు
ABN , First Publish Date - 2021-12-03T15:25:52+05:30 IST
చెన్నై నగరంలోని ప్రముఖ వస్త్రదుకాణం శరవణా స్టోర్స్లో గురువారం రెండో రోజు కూడా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిపారు. నగరంలోని సూపర్ శరణా, శరవణా సెల్వరత్నం స్టోర్, శరవణా సెల్వరత్నం
అడయార్(చెన్నై): చెన్నై నగరంలోని ప్రముఖ వస్త్రదుకాణం శరవణా స్టోర్స్లో గురువారం రెండో రోజు కూడా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిపారు. నగరంలోని సూపర్ శరణా, శరవణా సెల్వరత్నం స్టోర్, శరవణా సెల్వరత్నం నగల దుకాణం, ఫర్నిచర్ షాపు సహా దాదాపు 12 చోట్ల గురువారం రెండో రోజు కూడా ఈ సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువ ఆస్తులను గుర్తించడమే కాకుండా, పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టి.నగర్, పోరూర్, పురుసైవాక్కం, క్రోంపేట ప్రాంతాల్లో ఉన్న శరవణా స్టోర్లలో ఈ తనిఖీలు చేశారు. ఈ స్టోర్లతో పాటు మొత్తం 12 చోట్ల ఒకేసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తొలిరోజు జరిగిన తనిఖీల్లో గత రెండు సంవత్సరాలుగా సాగిన ఆ స్టోర్ల వ్యాపార లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు అర్థరాత్రి వరకు సాగాయి. మళ్ళీ గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు ప్రారంభించారు. 2020 సంవత్సరానికి సంబంధించి ఆదాయవ్యయాల వివరాలను సేకరించి పరిశీలించారు. రెండో రోజైన గురువారం కూడా దుకాణంలోని సిబ్బందిని కూడా బయటకు వెళ్ళనీయ కుండా తనిఖీలు చేశారు. తనిఖీలన్నీ పూర్తయిన తర్వాత కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తుల వివరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ సోదాలకు సంబం ధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.