సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు
ABN , First Publish Date - 2022-01-18T19:28:52+05:30 IST
సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకోవడంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకోవడంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రైతును ఓదర్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? అని నిలదీశారు. ‘‘సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? పంట వానపాలు.. రైతు కష్టం కన్నీటిపాలు... సాయం దొరమాటలకే చాలు. పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే... నష్టపోయిన రైతును ఆదుకోడానికి, ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’’ అని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు.