రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..: షర్మిల

ABN , First Publish Date - 2021-12-19T22:46:35+05:30 IST

ఆత్మహత్య చేసుకున్న రైతులు వరి రైతులే.. వరి వద్దంటే ఉరి తప్ప మరే మార్గం లేదని రైతులు చెబుతున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..: షర్మిల

మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతులు వరి రైతులే.. వరి వద్దంటే ఉరి తప్ప మరే మార్గం లేదని రైతులు చెబుతున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం  కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి‌లో పర్యటించారు. ఈ సందర్భంగా  షర్మిల మీడియాతో మాట్లాడుతూ..వరి ఎందుకు వేసుకోవద్దో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరి కొంటుందనే భరోసా ఇవ్వాలన్నారు. రుణ మాఫీ చేస్తా అన్నారు.. ఎంతమందికి చేశారో చెప్పాలని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, రైతుల ఆత్మహత్యల పాపం కేసీఆర్‌దేనని చెప్పారు.సీఎం కేసీఆర్ ఊసరవెల్లి లాగా మాటలు మారుస్తూ మాట్లాడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. 


లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారో సీఎం చెప్పాలన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారన్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కడుపు నిండుతదని ప్రశ్నించారు. వరి వేయమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎందుకు రాసిచ్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిక్కుమాలిన పాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-19T22:46:35+05:30 IST