షర్మిల ఇక మీ బిడ్డ.. ఆశీర్వదించండి
ABN , First Publish Date - 2021-04-10T07:52:48+05:30 IST
‘‘షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ. ఇక్కడి చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, సమస్యలు, ప్రజల ఇబ్బందులన్నీ ఆమెకు తెలుసు.
- ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తిత్వం మాది
- తెలంగాణ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాం
- రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలన లేదు
- ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ
ఖమ్మం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘‘షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ. ఇక్కడి చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, సమస్యలు, ప్రజల ఇబ్బందులన్నీ ఆమెకు తెలుసు. మీరు అన్నివిధాలా అండగా నిలుస్తూ ఆశీర్వదించండి’’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల ఇబ్బందులను షర్మిల గుర్తించిందని, ఆమె పెట్టే కొత్త పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజలు కోరుకున్న పాలన లేదని.. అభివృద్ధి, సంక్షేమం కొరవడిందని విమర్శించారు. ‘‘ఓదార్పు యాత్రతో తెలంగాణ ప్రజల కష్టాలను షర్మిల తెలుసుకుంది. అప్పుడే అనుబంధం మరింత పెరిగింది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం, నైతిక విలువలు తనకు ఉన్నాయి. ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే గుణం మా కుటుంబానిది. మీరు తోడుగా ఉండి షర్మిలను ముందుకు తీసుకెళ్లా’’లని అభ్యర్థించారు.
మీకు మా కుటుంబం రుణపడి ఉంది
తెలంగాణ ప్రజలకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని, వారి అభిమానం, ఆత్మీయత మరువలేనిదని విజయమ్మ అన్నారు. ఇక షర్మిల వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసం, ప్రగతి కోసమేనని, జనంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఆమెకు ఉంటాయని ఆకాంక్షించారు. పార్టీ పెడుతున్నట్లు, తెలంగాణ బిడ్డగా, రాజన్న బిడ్డగా మీముందుకు వస్తానన్నప్పుడు ఎంతో సంతోషించానని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలతో రాజశేఖరరెడ్డికి గొప్ప అనుబంధం ఉంది. 18 ఏళ్ల కిందట ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి.. సమస్యలను తెలుసుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ, న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం’’ అని విజయమ్మ అన్నారు.