నిధుల వరదతోనే ర్యాలీ
ABN , First Publish Date - 2021-06-14T06:32:17+05:30 IST
స్టాక్ మార్కెట్ ప్రస్తుత ర్యాలీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ డీ సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ, విదేశీ సంస్థల నుంచి భారీగా వచ్చిపడుతున్న నిధుల ప్రవాహమే ఇందుకు కారణమన్నారు...
- ఈక్విటీ మార్కెట్పై సుబ్బారావు వ్యాఖ్య
- పెరుగుతున్న‘ఆదాయ’ అంతరాలు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ప్రస్తుత ర్యాలీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ డీ సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ, విదేశీ సంస్థల నుంచి భారీగా వచ్చిపడుతున్న నిధుల ప్రవాహమే ఇందుకు కారణమన్నారు. దేశంలో ఇతర ‘ఆస్తుల’ ధరల ర్యాలీకీ ఈ పెట్టుబడుల వరదే కారణమన్నారు. పెట్టుబడుల కోసం మిగులు నిధులున్న వ్యక్తులు, సంస్థలే ఈ ర్యాలీతో లబ్దిపొందుతున్నారని చెప్పారు.
ఆశలు గల్లంతు: ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న ఆశలను కరోనా 2.0 వమ్ము చేసిందన్నారు. ఆర్బీఐ అంచనా వేసిన 9.5 జీడీపీ వృద్ధి రేలు సాధించినా, రెండేళ్ల క్రితం వృద్ధి రేటుతో పోలిస్తే అది తక్కువే అవుతుందన్నారు.
పెరుగుతున్న అంతరాలు: కొవిడ్ నేపథ్యంలో ధేశంలో దనికులు-పేదల మధ్య ఆదాయ అసమానతలు పెరిగి పోతున్నాయని సుబ్బారావు ఆందోళన వ్యక్తం చే శారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక రికవరీ అన్ని రంగాల్లో సమానంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు సూచిక అన్నారు. రాబోయే కాలంలో వృద్ధి అవకాశాలనూ ఇవి దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.
మితిమీరి అప్పులొద్దు: కొవిడ్ రెండో ఉధృతి నేపథ్యంలో మరిన్ని అప్పులు చేయాలన్న సూచనల్ని తోసిపుచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రుణభారం పెరిగి పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని పెట్టుబడి వ్యయాల్ని తగ్గించడం ద్వారా, ఆ నిధుల్ని కొవిడ్ ఖర్చులకు ఉపయోగించడం మేలన్నారు. ఇంకా అవసరమైతే కంపెనీల లాభాలు, మూలధన లాభాలపై ఒకసారికి వర్తించేలా పన్ను విధించే విషయం పరిశీలించాలని సూచించారు.