‘శశి’ రాక!

ABN , First Publish Date - 2021-02-12T06:37:02+05:30 IST

ససరిగ్గా నాలుగేళ్ళక్రితం అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం ముందు లొంగిపోవడానికి బెంగళూరు బయలుదేరిన శశికళ, ముందుగా తన నెచ్చెలి, అన్నాడీఎంకె అధినేత్రి...

‘శశి’ రాక!

ససరిగ్గా నాలుగేళ్ళక్రితం అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం ముందు లొంగిపోవడానికి బెంగళూరు బయలుదేరిన శశికళ, ముందుగా తన నెచ్చెలి, అన్నాడీఎంకె అధినేత్రి దివంగత జయలలిత సమాధిని దర్శించుకున్నారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, మధ్యమధ్యన ఏదో అంటూ ముమ్మారు జయలలిత సమాధిని కుడిచేత్తో బలంగా చరిచారు. ‘అమ్మ’ స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణానికి సర్వమూ సిద్ధం చేసుకున్నాక, ఆఖరుక్షణంలో అవకాశం చేజారిన శశికళ తనకు ద్రోహం చేసినవారిపై తిరిగిరాగానే ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారని అప్పట్లో అనుకున్నారు. సీఎం కుర్చీ ఎప్పటికైనా తనదేనంటూ శశికళ ప్రమాణం చేశారని మరికొందరు అన్నారు. మొన్న శశికళ జైలు నుంచి విడుదలై తమిళనాడుకు చేరుకున్న ఘట్టాన్ని గమనించినప్పుడు ఆమె ప్రమాణం నిజమవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. 


శశికళ జైల్లో ఉన్నా, బయటకు వచ్చినా తేడా ఏమీ ఉండదని అధికారపక్షం పెద్దలు అంటున్నారు. జనం క్రమంగా శశికళను మరిచిపోతారని పళని–పన్నీరు కూటమి నమ్మకం. జయలలిత కారులో, ఆమెకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తినే వినియోగించుకొని, పార్టీ జెండా రెపరెపలాడుతూండగా తమిళనాడులోకి శశికళ ప్రవేశం, ఎంజీఆర్‌ సమాధి సందర్శన రాజకీయంగా బలమైన సందేశాలే. ఏకైక శత్రువు డీఏంకేపై పోరాటానికి కలసిరండి అంటూ పిలుపునిచ్చి క్రియాశీల రాజకీయాల్లో తన పునఃప్రవేశాన్ని విస్పష్టంగా ప్రకటించారామె.


శశికళ రాక కచ్చితంగా అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేదే. లోపల విభేదాలున్నా పళని పన్నీరు ద్వయం బయటకు సయోధ్యతోనే ఉన్నారు. నెత్తిన ఎవరిపెత్తనం లేకుండా పనిచేసుకోగలుగుతున్నారు. పార్టీలో శశి పునఃప్రవేశం అసాధ్యమని తేల్చేయడంతో పాటు, మీడియాముందు ఎవ్వరూ ఆమె గురించి వ్యాఖ్యలు చేయరాదంటూ దిగువస్థాయి నాయకులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆమె రాకను బేఖాతరు చేసినట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు పరోక్షంగా ఆమెను ఉద్దేశించి అధినాయకులే వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నాడీఏంకేలో సామాన్య కార్యకర్తే ముఖ్యమంత్రి అవుతారనీ, ఒక కుటుంబం పార్టీని తన్నుకుపోలేదని స్వయంగా ముఖ్యమంత్రే ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. జెండా విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం, జయ నివాసాన్ని హడావుడిగా మెమోరియల్‌గా మార్చివేయడం, శశికళ సన్నిహితురాలి ఆస్తిపాస్తులను చెన్నయ్‌ కలెక్టరు స్వాధీనం చేసుకోవడం వంటివి అధికారపక్షంలో భయాన్ని చాటుతున్నాయి. ఆమెను విస్మరించడమా, ఢీకొట్టడమా అనే విషయంలో పార్టీకి ఇంకా స్పష్టత రాలేదు.


శశికళ మళ్ళీ కొత్తగా ప్రయాణం ఆరంభించాలి. జయలలిత కన్నుమూయగానే ఆ స్థానంలో కూర్చొనివుంటే వేరే విషయం. జయ భౌతికకాయానికి నివాళి ఘటించడానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, ఎంతో ఆత్మీయంగా శశికళ తలనిమిరిన దృశ్యాన్ని చూసినవారంతా సీఎం కుర్చీ ఇక ఆమెదేనని నమ్మారు. కానీ, కథ అడ్డం తిరిగింది. పన్నీరు కన్నీరు కారుస్తూ అమ్మసమాధి ముందు తిరుగుబాటు చేశారు. అక్రమాస్తుల కేసులో త్వరలోనే తీర్పు చెప్పబోతున్నాననంటూ న్యాయస్థానం ముందస్తు ప్రకటన చేసింది. వరుస పరిణామాలతో శశికళ అధికారానికి అల్లంతదూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలందరి మద్దతూ ఉండి, కొద్దిగడియల్లో సీఎం కావాల్సిన మనిషి పరప్పన అగ్రహార జైలుకు తరలిపోవాల్సివచ్చింది. పోయేముందు భీకర ప్రతినబూనిన శశికళ తిరిగివస్తూనే అటువంటి విన్యాసాలేమీ చేయకుండా అధికారపక్షం జయమెమోరియల్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అమ్మ సన్నిహితురాలిగా మూడుదశాబ్దాలపాటు పార్టీలో చక్రం తిప్పిన శశికళ ఎన్నడూ ప్రజల్లోకి నేరుగా వెళ్ళిందేమీ లేదు. ఆమె వారసురాలినంటూ నాలుగేళ్ళ తరువాత మళ్ళీ వచ్చిన ఆమెను ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి.

Updated Date - 2021-02-12T06:37:02+05:30 IST