షిడోల్ చేప కర్రీ
ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి షిడోల్ ఫిష్ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చేపను కర్రీగా లేదా చట్నీగా తినొచ్చు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ చేపలను...
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి షిడోల్ ఫిష్ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చేపను కర్రీగా లేదా చట్నీగా తినొచ్చు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ చేపలను ఇమ్యూనిటీ కోసం ఎక్కువగా తింటారు.
కావలసినవి
షిడోల్ చేపలు - పది, గుమ్మడికాయ - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - పదిహేను, పచ్చిమిర్చి - మూడు, పసుపు - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, ఆవాల నూనె - ఐదు టేబుల్స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, గోరువెచ్చని నీళ్లు - ఒక కప్పు.
తయారీ
గోరువెచ్చటి నీళ్లతో షిడోల్ చేపలను శుభ్రం చేయాలి. చేపల తల భాగాన్ని తీసేయాలి.
స్టవ్పై పాన్ పెట్టి రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక గుమ్మడికాయ ముక్కలు వేసి వేగించాలి.
కొద్ది పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. గుమ్మడికాయ ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్లో మళ్లీ నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి.
తరువాత పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగనివ్వాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, చేపలు వేసి కలియబెట్టాలి.
పసుపు, తగినంత ఉప్పు వేయాలి.
కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై మూత పెట్టి పావుగంట పాటు ఉడికించాలి.
కూర చిక్కబడిన తరువాత స్టవ్పై నుంచి దింపాలి.
అన్నంలోకి లేదా చపాతీలోకి షిడోల్ చేప కూర చాలా రుచిగా ఉంటుంది.