క్వారంటైన్ హోమ్లుగా నౌకలు
ABN , First Publish Date - 2020-04-01T05:52:03+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో నోవెల్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, అమలు చేస్తోన్న కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగానికి...
ఆంధ్రప్రదేశ్లో నోవెల్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, అమలు చేస్తోన్న కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగానికి, డాక్టర్లకు, పోలీస్ వ్యవస్థకు పౌర సమాజం ఎంతో రుణపడి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణా చర్యలు చేపట్టడంతో కేంద్రమూ ఎంతో శ్రద్ధ చూపింది. ప్రధాని మోదీ సమయోచిత నిర్ణయం తీసుకున్నారు. లేనిపక్షంలో భారత దేశంలోని 130కోట్ల జనాభాను కరోనా బారి నుంచి కాపాడటం కష్టతరంగా మారేది. అగ్రదేశాలు కూడా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంలో వెనుకబడి ఇక్కట్లు పడుతున్నాయి. అలాంటిది అటు భారత ప్రభుత్వం, ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టి కరోనా బారి నుంచి ప్రజలను తప్పించగలుగుతున్నాయి.
ఇండియన్ నేవీకి ఉన్న కొన్ని షిప్పులను క్వారంటైన్ హోమ్లుగా తీర్చిదిద్ది అందుబాటులో ఉంచితే దేశానికి చాలా మేలు జరిగే వీలుంది. చెన్నై, కాకినాడ, విశాఖపట్నం, కొచ్చిన్, గోవా వంటి ఓడరేవుల్లో ఒక్కొక్క షిప్పును క్వారంటైన్ హోంగా మార్చి ఆయా నౌకాశ్రయాల్లో ఉంచితే కరోనా రోగులకు మేలు జరుగుతుంది. ఈ బాధ్యతలను ఇండియన్ నేవీకి అప్పగిస్తే బాగుంటుంది. షిప్పులను క్వారంటైన్ హొంలుగా మార్చే ఆలోచనతో ఇప్పటి వరకూ ఏ దేశమూ ముందుకు రాలేదు. కనుక ఉన్నతాధికారులు ఈ దిశగా అడుగులు ముందుకు వేయడం శ్రేయస్కరం.
ప్రొఫెసర్ డి. నారాయణరావు,
ప్రో వైస్ చాన్సలర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ