టార్గెట్ బీజేపీ... యూపీ, గోవా ఎన్నికల్లో శివసేన

ABN , First Publish Date - 2021-09-12T20:33:49+05:30 IST

త్వరలో ఎదురవ్వనున్న యూపీ, గోవా ఎన్నికల్లో బీజేపీకి మరో ప్రత్యర్థి కూడా సిద్ధం అవుతోంది. గతంలో మిత్ర పక్షంగా ఉండి ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారిన శివసేన వచ్చే సంవత్సరం కీలక ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టింది.

టార్గెట్ బీజేపీ... యూపీ, గోవా ఎన్నికల్లో శివసేన

త్వరలో ఎదురవ్వనున్న యూపీ, గోవా ఎన్నికల్లో బీజేపీకి మరో ప్రత్యర్థి కూడా సిద్ధం అవుతోంది. గతంలో మిత్ర పక్షంగా ఉండి ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారిన శివసేన వచ్చే సంవత్సరం కీలక ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టింది. 2022లో యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రం, గోవా లాంటి చిన్న రాష్ట్రం రెండూ ఎలక్షన్స్ ముంగిట నిలవనున్నాయి. రెండు చోట్లా కమలదళానిదే ప్రస్తుతం అధికారం. ఎలాగైనా మోదీ, అమిత్ షా జోరుకి కళ్లెం వేయాలని చూస్తోన్న శివసేన సదరు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో తమ అభ్యర్థుల్ని నిలపాలని భావిస్తోందట. ఈ విషయంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికరంగా స్పందించారు...

రానున్న ఉత్తర్ ప్రదేశ్, గోవా ఎన్నికల్లో తమ పార్టీ వీలైనన్ని సీట్లలో పోటీ చేస్తుందని సంజయ్ అంటున్నారు. 400 పైచిలుకు స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో 80 నియోజక వర్గాల్లో తాము పోటీలో ఉంటామని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోని రైతులు తమకు మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపారని కూడా ఆయన తెలిపారు. ఇక గోవాలో మొత్తం 40 సీట్లుండగా 20 మంది వరకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని రౌత్ పేర్కొన్నారు. గోవాలో మహారాష్ట్రలోని ‘మహా వికాస్ అగాడి‘ మాదిరిగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని ఆయన తెలిపారు. 

గోవాలో, మహారాష్ట్రలో శివసేన కూడా కమలదళానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే కాషాయ నేతలకు కొంచెం నష్టమనే చెప్పాలి. శివసేన ఇమేజ్ కూడా హిందూత్వపైనే ఆధారపడటంతో బీజేపీ ఓట్లు కొన్ని అటుగా మళ్లే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి, సంజయ్ రౌత్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ నుంచీ ఎలాంటి స్పందన వస్తుందో...  

Updated Date - 2021-09-12T20:33:49+05:30 IST