శోభానాయుడు పేరిట అంతర్జాతీయ నాట్య పోటీలు
ABN , First Publish Date - 2021-03-05T07:05:10+05:30 IST
ప్రముఖ నర్తకి శోభానాయుడు పేరిట అంతర్జాతీయ స్థాయిలో నాట్య పోటీలు నిర్వహించి పురస్కారాలు అందించి గురుభక్తి చాటుకున్నారు ఆమె శిష్యురాలు డాక్టర్ పద్మజారెడ్డి.
విజేతలకు పురస్కారాలు అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఖైరతాబాద్ మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నర్తకి శోభానాయుడు పేరిట అంతర్జాతీయ స్థాయిలో నాట్య పోటీలు నిర్వహించి పురస్కారాలు అందించి గురుభక్తి చాటుకున్నారు ఆమె శిష్యురాలు డాక్టర్ పద్మజారెడ్డి. నాట్యంలో ప్రపంచ స్థాయికి ఎదగడమే కాక ఎంతోమంది నిష్ణాతులను తయారుచేసిన శోభానాయుడు పేరిట అంతర్జాతీయ పోటీలు జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి గురువారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో జరిగిన కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొని విజేతలకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ పద్మజారెడ్డి రచించిన కూచిపూడి సంప్రదాయం పుస్తకాన్ని ఆవిష్కరించారు. పద్మజారెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రతియేటా కూచిపూడి నాట్యపోటీలు నిర్వహిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో పోటీలకు జ్యూరీలుగా వ్యవహరించిన నాట్యగురువులు వేదాంతం రాధేశ్యాం, డాక్టర్ ఎస్. కృష్ణభారతి, డాక్టర్ వనజా ఉదయ్, ప్రతినిధులు మహ్మద్ రఫీ, నాగయ్య, సుమలత పాల్గొన్నారు.