అందుకే అంతం చేశారు.. దివ్య కేసులో బయటపడిన షాకింగ్ నిజం.. వీడిన మిస్టరీ..!
ABN , First Publish Date - 2020-06-08T16:00:12+05:30 IST
వ్యభిచారం చేసి సంపాదిస్తున్న డబ్బును సరిగా ఇవ్వకపోవడంతో తాను బయటకు వెళ్లిపోతానని చెప్పడం వల్లే దివ్యను హత్యచేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దివ్య వెళ్లిపోతే తనకు ఆదాయం ఉండదనే భావనతో వసంత, ఆమె సోదరి మంజు,
బయటకు వెళ్లిపోతాననడంతో అంతమొందించారు
దివ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
చిత్రహింసలకు గురిచేసిన నిందితులు
నోట్లో గుడ్డలు కుక్కి వాతలు
విశాఖపట్నం/సీతంపేట (ఆంధ్రజ్యోతి): వ్యభిచారం చేసి సంపాదిస్తున్న డబ్బును సరిగా ఇవ్వకపోవడంతో తాను బయటకు వెళ్లిపోతానని చెప్పడం వల్లే దివ్యను హత్యచేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దివ్య వెళ్లిపోతే తనకు ఆదాయం ఉండదనే భావనతో వసంత, ఆమె సోదరి మంజు, గంగవరానికి చెందిన ఆమె పెద్దమ్మ ధనలక్ష్మి, మంజు ప్రియుడు సంజయ్ల సహాయంతో తన ఇంట్లోనే రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్టు నిర్ధారించారు. వీరితోపాటు దివ్యను వ్యభిచారం రొంపిలోకి దింపిన రావులపాలేనికి చెందిన దివ్య పిన్ని క్రాంతివేణి, దివ్యను వసంతకు అప్పగించిన ఎన్ఏడీకి చెందిన గీత అలియాస్ కుమారిని కూడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దివ్య తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మృతి చెందడంతో ఆమె పిన్ని క్రాంతివేణి వద్ద ఉండేది. ఏడాది కిందట దివ్యను ఎన్ఏడీ జంక్షన్లోని గీత అలియాస్ కుమారికి అప్పగించింది. దివ్య అందంగా ఉండడంతో కుమారి ఆమెతో వ్యభిచారం చేయించింది. ఎనిమిది నెలల కిందట దివ్యను అక్కయ్యపాలెం చెక్కుడురాయి బిల్డింగ్ సమీపంలో ఉంటున్న గుట్టల వసంత అలియాస్ రాణికి అప్పగించింది. అప్పటినుంచి దివ్య వసంత ఇంట్లోనే ఉంటోంది. వసంత సోదరి మంజు భర్త మృతిచెందడంతో సంజయ్ అనే యువకుడితో కలిసి వసంత ఇంటికి సమీపంలోనే ఉంటోంది. వీరిద్దరూ దివ్య కలిసి వ్యభిచారం చేస్తుండేవారు. దివ్య అందంగా ఉండడంతో వారిద్దరికంటే ఆమెకే డిమాండ్ ఎక్కువగా ఉండేది. అయితే దివ్యకు వసంతకు డబ్బులు పంపకంలో తేడాలు రావడంతో తాను బయటకు వెళ్లిపోతానని దివ్య ఎదురుతిరిగింది. దీంతో వసంత విషయాన్ని తన సోదరి మంజుకి చెప్పగా వారిద్దరూ కలిసి గంగవరంలోని తమ పెద్దమ్మ ధనలక్ష్మికి చెప్పడంతో ముగ్గురూ కలిసి దివ్యను బయటకు వెళ్లొద్దంటూ రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా దివ్య తాను వెళ్లిపోతానని చెప్పడంతో మంజు ప్రియుడు సంజయ్తో కలిసి నలుగురూ దివ్యను ఒక గదిలో బంధించి గుండు చేసి, కనుబొమ్మలు తొలగించారు.
అయినప్పటికీ వెళ్లిపోతానని చెప్పడంతో తిండి పెట్టకుండా అట్లకర్రతో శరీరంపై వాతలు పెట్టేవారు. బాధకు దివ్య అరవడం వల్ల బయటవారికి విషయం తెలిసిపోతుందనే భావనతో ఆమెకు నోట్లో గుడ్డలు కుక్కేసేవారు. తర్వాత చపాతీకర్రతో విచక్షణారహితంగా బాదేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో దివ్య ఈనెల మూడవ తేదీ రాత్రి ప్రాణాలు కోల్పోయింది. విషయం ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు చేయడానికి వసంత సన్నాహాలు చేయగా వ్యాన్డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు పొక్కింది. దివ్య ఫిట్స్తో చనిపోయిందని వసంత పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా హత్యోదంతం బయటపడింది. పోస్టుమార్టంలో దివ్య శరీరంపై 33 గాయాలున్నాయని, చిత్ర హింసలకు గురిచేసి హత్యచేశారని తేలడంతో ఫోర్త్టౌన్ ఇన్ఛార్జి సీఐ కొరాడ రామారావు, ఎస్ఐ సూర్యానారాయణ దర్యాప్తు ముమ్మరం చేసి ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజు, పెద్దమ్మ ధనలక్ష్మి, వీరికి సహకరించిన సంజయ్లతోపాటు దివ్యను వ్యభిచార కూపంలోనికి దింపిన ఆమె పిన్ని క్రాంతివేణి, వసంతకు ఆమెను అప్పగించిన గీతను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు.