స్వల్పకాలిక, డే ట్రేడర్లకు అక్కర్లేదు
ABN , First Publish Date - 2020-09-27T07:44:15+05:30 IST
లిస్టెడ్ షేర్ల డే ట్రేడింగ్ లేదా స్వల్పకాలిక విక్రయం/కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఆదాయ పన్ను రిటర్నుల్లో స్ర్కిప్ ఆధారితంగా చూపించాల్సిన అవసరం లేదని...
- ఐటీ రిటర్నుల్లో స్ర్కిప్ ఆధారిత వివరాలపై ఆర్థిక శాఖ స్పష్టత
న్యూఢిల్లీ: లిస్టెడ్ షేర్ల డే ట్రేడింగ్ లేదా స్వల్పకాలిక విక్రయం/కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఆదాయ పన్ను రిటర్నుల్లో స్ర్కిప్ ఆధారితంగా చూపించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మదింపు సంవత్సరం (ఏవై) 2020-21 కోసం స్టాక్ ట్రేడర్లు, డే ట్రేడర్లు.. తమ రిటర్నుల్లో స్ర్కిప్ ఆధారిత వివరాలను వెల్లడించాలని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ స్పష్టతనిచ్చింది.
సాధారణంగా స్టాక్ ట్రేడర్లు లేదా డే ట్రేడర్లు.. షేర్ ట్రేడింగ్ ద్వారా ఆర్జించిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభం లేదా వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటారు. చాలా కేసుల్లో ఏడాది లోపు ఉంచుకున్న షేర్లు, యూనిట్ల విషయంలో ముందస్తుగానే ఈ వివరాలను వెల్లడిస్తుంటారు, ఒకవేళ వెల్లడించని పక్షంలో వాటిని దీర్ఘకాలిక మూలధన లాభాల కేటగిరీలోకి చేరుస్తారు. మరోవైపు ఫైనాన్స్ చట్టం, 2018కి లోబడి 2018 జనవరి 31 వరకు ఉన్న లిస్టెడ్ షేర్లు, ప్రత్యేక యూనిట్లపై ఆర్జించిన లాభాలపై కూడా పన్ను మినహాయింపులకు అనుమతిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.