గురువులు ఎక్కడ? కేజీబీవీల్లో కొలిక్కిరాని ఖాళీల భర్తీ
ABN , First Publish Date - 2022-01-17T22:32:25+05:30 IST
జిల్లాలోని కస్తూర్భా బాలికా విద్యాకేంద్రాలు (కేజీబీవీ)లో బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు. తగినంతమంది గురువులు లేక రెండేళ్లుగా
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
(ఇచ్ఛాపురం రూరల్): జిల్లాలోని కస్తూర్భా బాలికా విద్యాకేంద్రాలు (కేజీబీవీ)లో బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు. తగినంతమంది గురువులు లేక రెండేళ్లుగా బోధన సక్రమంగా సాగడంలేదు. ఉన్నవారితోనే సర్దుబాటు చేసి మమ అన్పిస్తున్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు జిల్లా సమగ్ర శిక్ష ద్వారా దరఖాస్తుల స్వీకరణ, మెరిట్ జాబితా తయారీ పూర్తిచేశారు. గత నెల 28 నాటికి ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఉత్తర్వులు ఇస్తారని భావించారు. పీఈటీ పోస్టుల అర్హత విషయంలో మెలిక పడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టెట్ రాసిన వారు వీటికి అర్హులు. 2018 తరువాత ఇది జరగలేదు. దీని వల్ల దరఖాస్తుదారుల్లో టెట్ రాయని వారందరినీ అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిశారు. టెట్ నిర్వహించకపోవడం వల్ల రాయలేదని, తమ దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వారి పేర్లు కూడా చేర్చారు. ఆ విధంగా కొన్ని రోజులు జాప్యమైంది. ఈ నెల 3న రోస్టర్ ప్రకారం ఎంపిక జాబితా విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. అంతా సిద్ధం చేశాక ఎస్పీడీ కార్యాలయం నుంచి తాము చెప్పిన తరువాతే ప్రకటించాలని ఆదేశాలొచ్చాయి. ఇక ప్రభుత్వానికి మరికొన్ని వినతులూ వెళ్లాయి. బ్యాక్లాగ్ పోస్టులు రోస్టర్ ప్రకారం ఇవ్వాలని అందులో కోరారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో మాత్రం జనరల్ రోస్టర్ అనుసరించాలని పేర్కొంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.