అట్రాసిటీ కేసులు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-06-24T04:29:23+05:30 IST
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంతోపాటు ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆర్డీవో సరోజని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆర్డీవో సరోజని
నాయుడుపేట, జూన్ 23 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంతోపాటు ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆర్డీవో సరోజని అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆర్డీవో అధ్యక్షతన నాయుడుపేట డివిజన్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆయాశాఖల అధికారులు ఒక ప్రత్యేక దృక్పథంతో వెనుకబడిన దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. ప్రతినెలలో గ్రామాల్లో జరిగే సివిల్ రైట్స్డేలో తహసీల్దారు, ఎస్ఐ, ఎంపీడీవో, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నాలని సూచించారు. నాయుడుపేటలో నిర్మించి ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనానికి ప్రహరీని నిర్మించాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో నాయుడుపేట సీఐ సోమయ్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యురాలు అనురాధ, మున్సిపల్ కమిషనర్లు చంద్రశేఖర్రెడ్డి, నరేంద్ర, అన్నిమండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలు, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.