ముడు నిమిషాల్లో ముగించాలి
ABN , First Publish Date - 2020-08-15T10:07:38+05:30 IST
కరోనా నేపథ్యంలో నేడు జరిగే 74వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కరోనా నేపధ్యంలో నిరాడంబరంగా స్వాతంత్యదినోత్సవం
తొలిసారి కలెక్టరేట్లలో ప్రధాన ఉత్సవాలకు ఏర్పాట్లు
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, ఆగస్టు 14: కరోనా నేపథ్యంలో నేడు జరిగే 74వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలో మూడు నిమిషాల్లో జండా వందన కార్యక్రమం, మొత్తంగా 15నిమిషాల్లో కార్యక్రమం ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు, డీఆర్వో శిరీష, ఏవో మదన్గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ 10గంటలకు జెండా ఎగువేయనున్నారు. ప్రజ్ఞ సమావేశ మందిరంలో అనుమతి పొందిన వీఐపీలకు మాత్రమే స్నాక్స్, స్వీట్లు అందచేయనున్నారు. అక్కడే కొద్దిసేపు మంత్రి పువ్వాడ ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా తాము గుర్తెరిగిన తరువాత స్వాతంత్ర వేడుకల్లో ఇలాంటి పరిస్థితి చూడలేదని సీనియర్ సిటిజన్లు, సీనియర్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
కరోనా నేపధ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో ఉదయం 9.30గంటలకు జాతీయ జండాను ఆవిష్కరించాలని తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి అధికారులు హాజరు కావాలన్నారు.