భావితరాలకు ప్రజాకళలను అందించాలి
ABN , First Publish Date - 2021-11-29T06:36:20+05:30 IST
భావితరాలకు ప్రజాకళలను అందించాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కప్పల వెంకటేశ్వర్లు (కేవీఎల్) కోరారు.
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎల్
హుజూర్నగర్, నవంబరు 28: భావితరాలకు ప్రజాకళలను అందించాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కప్పల వెంకటేశ్వర్లు (కేవీఎల్) కోరారు. ప్రజానాట్యమండలి జిల్లా మహాసభ సందర్భంగా పట్టణంలోని ఇందిర సెంటర్లో ఆదివారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల ప్రజా పోరాటాల్లో ప్రజానాట్యమండలి కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజలను కళాఉద్యమాల ద్వారా చైతన్యం చేసినట్లు తెలిపారు. స్వాతంత్రోద్యమం మొదలు తెలంగాణ మలిదశ పోరాటం వరకు ఆటపాటలు, నాటికలు, ఒగ్గు, బుర్రకథల ద్వారా జనాన్ని జాగృతం చేసిందన్నారు. కవులు, కళాకారులు అందమైన భవంతుల్లో ఉండకుండా ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఆకలి, నిరుద్యోగం, అసమానతలు, అవినీతి, చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు పెరిగాయన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పాలకవర్గాలు విస్మరిస్తున్నాయన్నారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. పాలకులు సంక్షేమం పేరుతో తాయిలాలు ఇస్తూ అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజలు సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, సత్యనారాయణ, నర్సయ్య, పాల్గొన్నారు.