అమర జవాన్ జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర
ABN , First Publish Date - 2022-01-26T09:06:51+05:30 IST
ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి), బాపట్లరూరల్, జనవరి 25: ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. బాపట్ల మండలం, ధరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంతరెడ్డి.. 2016లో ఆర్మీలో చేరారు. గతేడాది జూలై 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో ఆయనకు శౌర్యచక్ర అందిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా జశ్వంతరెడ్డి తండ్రి మరుప్రోలు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణకై తన కుమారుడు ప్రాణాలను అర్పించడం గర్వంగా ఉందని తెలిపారు. జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.