మిస్ వరల్డ్ అమెరికాగా భారత సంతతి యువతి.. తొలి భారతీయ అమెరికన్గా రికార్డ్!
ABN , First Publish Date - 2021-10-05T15:53:27+05:30 IST
మిస్ వరల్డ్ అమెరికా 2021 కిరీటం దక్కించుకున్న తొలి భారత సంతతి యువతిగా శ్రీ సైనీ నిలిచింది. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో అగ్రరాజ్యానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారతీయ అమెరికన్ కూడా సైనీనే. పంజాబ్ రాష్ట్రం లూధియానాకు చెందిన సైనీ కుటుంబం ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడు అమెరికాకు వలస వెళ్లి వాషింగ్టన్లో స్థిర...
లాస్ ఏంజిల్స్: మిస్ వరల్డ్ అమెరికా 2021 కిరీటం దక్కించుకున్న తొలి భారత సంతతి యువతిగా శ్రీ సైనీ నిలిచింది. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో అగ్రరాజ్యానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారతీయ అమెరికన్ కూడా సైనీనే. పంజాబ్ రాష్ట్రం లూధియానాకు చెందిన సైనీ కుటుంబం ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడు అమెరికాకు వలస వెళ్లి వాషింగ్టన్లో స్థిర పడింది. సైనీకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. దీంతో ఆమె జీవితాంతం పేస్మేకర్(కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి. అయినా ఆమె వీటన్నింటినీ అధిగమించి మిస్ వరల్డ్ అమెరికా కిరీటం దక్కించుకుంది.
లాస్ ఏంజిల్స్లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన శ్రీ సైనీకి డయానా హెడెన్ కిరీటాన్ని తొడిగారు. తద్వారా అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి మహిళగా షైనీ గుర్తింపు పొందింది. శ్రీ షైనీ మాట్లాడుతూ..."మిస్ వరల్డ్ అమెరికా కిరీటం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే చెందాలి. వారి ప్రోత్సహంతోనే ఇంతవరకు రాగలిగాను. చిన్నప్పటి నుంచి వారు నాకు నచ్చిందే చేయమని ఎంతో ప్రోత్సహించారు. మిస్ వరల్డ్ అమెరికా కావడం చిన్ననాటి కల. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యవాదాలు." అని చెప్పుకొచ్చింది.