New Delhi: శ్రీరాముడి భక్తులకు శుభవార్త
ABN , First Publish Date - 2021-10-05T13:58:33+05:30 IST
దేశంలో హిందూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పండగ సీజన్లో శ్రీ రామాయణ రైలు యాత్రను...
శ్రీ రామాయణ రైలు యాత్ర..ఐఆర్సీటీసీ కొత్త టూర్ ప్లాన్
న్యూఢిల్లీ : దేశంలోని శ్రీరాముడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త వెల్లడించింది. హిందూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పండగ సీజన్లో శ్రీ రామాయణ రైలు యాత్రను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది.ఐఆర్సీటీసీ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా శ్రీ రామాయణ యాత్రను నవంబరు 7వతేదీన ప్రారంభించనున్నారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో భాగంగా యాత్రికులు శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని యాత్రా ప్రదేశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక పర్యాటక రైళ్లు, డీలక్స్ టూరిస్ట్ రైళ్లను ఉపయోగించుకుని రైలు టూర్ ప్యాకేజీలను ప్లాన్ చేసినట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.దక్షిణ భారతదేశంలోని యాత్రికుల కోసం ఐఆర్సిటిసి స్లీపర్ క్లాస్ కోచ్లతో కూడిన బడ్జెట్-సెగ్మెంట్ రైలులో శ్రీ రామాయణ యాత్ర మదురై నగరం నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు మధురై నుంచి దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్టై, కాట్పాడి, చెన్నై సెంట్రల్, రేణిగుంట,కడప, హంపి, నాసిక్, చిత్రకూట్, ప్రయాగరాజ్, వారణాసిలలో తిరిగి మధురైకి చేరుకుంటుంది.12 రాత్రులు, 13 రోజులు సాగనున్న శ్రీ రామాయణ యాత్ర మధురై నుంచి నవంబర్ 16వతేదీన ప్రారంభం కానుంది.ఉత్తర భారతదేశంలో బడ్జెట్ సెగ్మెంట్ పర్యాటకుల కోసం ఐఆర్ సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక పర్యాటక రైళ్లతో నిర్వహించనుంది.
16 రాత్రులు, 17 రోజులు శ్రీ రామాయణ యాత్ర నవంబర్ 25వతేదీన శ్రీ గంగానగర్ నుంచి ప్రారంభం కానుంది.ఈ రైలు శ్రీ గంగానగర్ నుంచి అబోహర్-మాలౌట్, భటిండా, బర్నాలా, పాటియాలా, రాజ్పురా, అంబాలా క్యాంట్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, ఢిల్లీ క్యాంట్, గుర్గావ్, రేవారీ, అల్వార్, జైపూర్, ఆగ్రాల వద్ద బోర్డింగ్, డి-బోర్డింగ్ పాయింట్లతో ప్రారంభమవనుంది. కోట, ఇటావా, కాన్పూర్ అయోధ్య, సీతామర్హి, జనక్పూర్, వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురంల మీదుగా ఈ రైలు శ్రీ గంగానగర్కు తిరిగి రానుంది.పూణే నుంచి శ్రీ రామ్ పథ యాత్ర 7 రాత్రులు,8 రోజులు నవంబర్ 27 నుంచి ప్రారంభమవనుంది. సబర్మతి నుంచి 7 రాత్రులు, 8 రోజులు శ్రీ రామ్ పథ యాత్ర డిసెంబర్ 25 నుంచి ప్రారంభమవనుంది.కరోనా మార్గదర్శకాల పాటిస్తూ ఈ యాత్రలు చేపడతామని ఐఆర్సీటీసీ వివరించింది.