చేపల కోసం షట్టర్ ధ్వంసం
ABN , First Publish Date - 2020-06-04T10:14:54+05:30 IST
మండల పరిధిలోని భూపనపాడులో చేపల కోసం కొందరు చెరువు తూము షట్టర్ను పగులగొట్టారు. దీంతో నీరు వృథాగా వెళుతోంది.
చెరువు నీరు వృథా
పాణ్యం, జూన్3: మండల పరిధిలోని భూపనపాడులో చేపల కోసం కొందరు చెరువు తూము షట్టర్ను పగులగొట్టారు. దీంతో నీరు వృథాగా వెళుతోంది. చెరువు నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో చేపల పెంపకానికి గత ఏడాది మత్స్యకారులు టెండరు వేశారు. చెరువులో చేపలు పట్టుకునేందుకు వీలుగా నీటిని తొలగించేందుకు షట్టర్ను తొలగించారని ఈఓఆర్డీ భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శి శిరీషకు రైతులు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో వారు చేపల హక్కుదారులు, రైతులను విచారించారు. తాము షట్టర్ను తొలగించలేదని, కొంత కాలంగా తూము రిపేరీలో ఉందని మత్స్యకారులు అధికారులకు తెలిపారు.
రిపేరీలో లేదు..
భూపనపాడు చెరువు తూము రిపేరీలో లేదు. పంట కాల్వలు ఏర్పాటు చేయాలని రైతులు గతంలో కోరారు. తూము షట్టర్ తొలగించారని రైతులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత వాటర్ అసోసియేషన్ సభ్యులు, రైతులదే. నీటి వృథాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.
- నాగన్న, ఎంఐఏఈ