దివ్యాంగుడి కుటుంబంపై ఎస్ఐ దురుసు ప్రవర్తన..సస్పెండ్
ABN , First Publish Date - 2020-06-03T23:11:24+05:30 IST
ఇంద్రవెల్లి ఎస్ఐ గంగారాం తీరు విమర్శలకు తావిస్తోంది.
అదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి ఎస్ఐ గంగారాం తీరు విమర్శలకు తావిస్తోంది. మండలంలోని ముత్తునూరు గ్రామంలో ఎస్ఐ విచక్షణ మరిచి ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లెక్సీ విషయంలో ఓ దివ్యాంగుడితోపాటు అతని కుటుంబంపై క్రూరంగా దాడి చేసిన సీసీ పుటేజ్ వైరల్ అవుతోంది. మే 1వతేదీన రెండు దుకాణాల మధ్య తగాదాకు కారణమైన ఫ్లెక్సీ వివాదంలో ఎస్ఐ జోక్యం చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే దుకాణం నిర్వహిస్తున్న దివ్యాంగుడిని కడుపులో తన్ని రాక్షత్వాన్ని ప్రదర్శించాడు. ఇదేంటని ప్రశ్నించిన అతని ఇద్దరు కుమారులను చితక్కొట్టాడు. చిన్న వివాదంలో బాధ్యతగల ఎస్ఐ క్రూరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
బాధిత కుంటుంబం ఫిర్యాదుతో ఎస్ఐని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. అదే సమయంలో ఎస్ఐపై వచ్చిన అన్నిరకాల ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.