‘చెల్లాపూర్‌’ నిరుద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణం!

ABN , First Publish Date - 2021-11-09T15:40:30+05:30 IST

సంచలనం సృష్టించిన నిరుద్యోగి ఆత్మహత్య కేసులో..

‘చెల్లాపూర్‌’ నిరుద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణం!

దుబ్బాక: సంచలనం సృష్టించిన నిరుద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసిందని పోలీసులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్‌లో ఆదివారం వెలుగుచూసిన యువకుడి ఆత్మహత్యకు అసలు కారణం ఉద్యోగం రాకపోవడం కాదని, తండ్రి తీరుతో మనస్తాపానికి గురవ్వడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని వారు వెల్లడించారు. మృతుడి లోదుస్తుల్లో లభించిన లేఖ ద్వారా ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. చెల్లాపూర్‌కు చెందిన పెంజర్ల రాకేశ్‌(22) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతడి మృతదేహం వద్ద దొరికిందంటూ స్థానిక నాయకుడొకరు ఒక లేఖను ఇచ్చినట్టు పోలీసులు తొలుత తెలిపారు. ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో ఉంది. 


మృతుడి తండ్రి భిక్షపతి కూడా.. ఉద్యోగం రాకపోవడం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మృతదేహానికి పోస్టుమార్టం చేసే సమయంలో.. రాకేశ్‌ అండర్‌వేర్‌కు ఉన్న జేబులో మరో లేఖ బయటపడిందని.. తనను తండ్రి ప్రతిసారీ అవమానిస్తుండటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో ఉందని.. దుబ్బాక పోలీసులు సోమవారం తెలిపారు. రాకేశ్‌ దుస్తులను, ఆ లేఖను వైద్యసిబ్బంది తమకు అప్పగించినట్టు వెల్లడించారు. రెండు లేఖల్లోని చేతిరాతను రాకేశ్‌ చేతిరాతతో పోల్చిచూడగా.. ఉద్యోగం రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉన్న లేఖలోని చేతిరాత.. రాకేశ్‌ చేతిరాతకు భిన్నంగా ఉండగా, లోదుస్తుల్లో దొరికిన లేఖలోని రాత అతడి చేతిరాతతో సరిపోలిందని వివరించారు. దీంతో.. కేసును తప్పుదారి పట్టించేందుకే మొదటి లేఖను సృష్టించారనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. తప్పుడు లేఖను సృష్టించిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 


లేఖలో ఏముందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి రోజూ తనను అవమానించడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు.. రాకేశ్‌ లోదుస్తుల్లో దొరికిన లేఖలో ఉంది. ‘‘ఎందుకు పుట్టావ్‌?’’ అంటూ తండ్రి తనను మాటిమాటికీ చీదరించుకునేవాడని, కొట్టేవాడని రాకేశ్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు. తన ముఖంపై నల్లమచ్చలు ఏర్పడితే, ఆసుపత్రిలో చూపించేందుకు కూడా తండ్రి నిరాకరించినట్టు పేర్కొన్నాడు. తాను బతికి ఉండడం దండగ అని, తనకు తిండి దండగ అని తండ్రి అవమానించేవాడని.. ‘‘నీవు చనిపోతే బాగుండ’’ని తండ్రి చీదరించుకునేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి చనిపోవడంతో తండ్రి తనను సరిగ్గా చూడటం లేదని రాశాడు. తాను చనిపోతున్నానని, ఇకనైనా నాన్న సంతోషంగా ఉండాలని రాకేశ్‌ తన లేఖలో పేర్కొన్నట్టు పోలీసులు వివరించారు.

Updated Date - 2021-11-09T15:40:30+05:30 IST