ఈ ఏడాది రూ.90,000కు వెండి!
ABN , First Publish Date - 2021-01-07T07:09:34+05:30 IST
గత ఏడాది ఇన్వెస్టర్లకు పెట్టుబడికి దీటుగా భారీగా రాబడులందించిన బంగారం, వెండి.. 2021లోనూ అదే దూకుడు కొనసాగించవచ్చునని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు.
- రూ.65,000 స్థాయికి తులం బంగారం
- ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిపుణుల అంచనా
ముంబై: గత ఏడాది ఇన్వెస్టర్లకు పెట్టుబడికి దీటుగా భారీగా రాబడులందించిన బంగారం, వెండి.. 2021లోనూ అదే దూకుడు కొనసాగించవచ్చునని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్ డాలర్ బలహీనపడుతుండటం, చౌక వడ్డీ రేట్లు-అధిక ద్రవ్యోల్బణ పరిణామాలు, భారత్ వంటి భారీ జనాభా కలిగిన దేశాల్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమంపై ఇంకా స్పష్టత లేకపోవడం బులియన్ ధరలకు దన్నుగా నిలవనున్నాయని వారంటున్నారు.
యూరప్, అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపై అనిశ్చితి పెరిగిందని, ఈ నేపథ్యంలో బులియన్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరగనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిపుణుల బృందం పేర్కొంది. అనిశ్చితిలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండి ధరలు ఈ ఏడాది మరింత ఎగబాకనున్నాయని వారన్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే తులం బంగారం 65,000, కిలో వెండి రూ.90,000 స్థాయికి చేరుకోవచ్చని వారు అంచనా వేశారు.
రూ.70వేల ఎగువకు వెండి
ఢిల్లీ స్పాట్ మార్కెట్లో బుధవారం బులియన్ ధరలు మిశ్రమంగా ముగిశాయి. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.71 తగ్గి రూ.51,125గా నమోదైంది. కిలో వెండి రేటు మాత్రం రూ.156 పెరిగి రూ.70,082కు చేరుకుంది.