నిష్ఠగా..
ABN , First Publish Date - 2021-08-04T04:42:21+05:30 IST
నిష్ఠగా..
- మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో
- నేటి నుంచి నిష్ఠ శిక్షణ తరగతులు
- యూపీఎస్, హైస్కూల్
- ఉపాధ్యాయులకు
- ఐదునెలల పాటు శిక్షణ
- హాజరుకానున్న 1600 మంది ఉపాధ్యాయులు
- నైపుణ్య మెరుగుదలకు ఆన్లైన్ శిక్షణ
ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి: వృత్తినైపుణ్యం, బోధనలో అవసరమైన మెళకువలు, తదితర అంశాలపై ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడానికి బుధవారం నుంచి మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో నిష్ఠ ఆన్లైన్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి మంగళవారం జిల్లా అధికారులు ఆన్లైన్లో ఓరియెంటేషన్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో నిష్ఠ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కూల్ హెడ్స్, టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్) కింద శిక్షణ ఇవ్వనున్నారు. 2019 జనవరిలో మొదటి విడతలో ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులు 94వేల మందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో సౌత్ ఇండియాలో తెలంగాణకు మొదటిస్థానం దక్కింది. నిష్ఠ-2 కింద యూపీఎస్, హైస్కూల్ ఉపాఽధ్యాయులకు నేటినుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈసారి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా తరగతులు ఆగస్టు నుంచి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఉపాధ్యాయుడు దీక్ష పోర్టల్(యాప్) ద్వారా ఆన్లైన్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. అనంతరం ఫిబ్రవరిలో అసైన్మెంట్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ప్రమాణ పత్రం అందజేయనున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తరగతులకు హాజరవుతున్నారా.. లేదా అనే అంశంపై ఎప్పటికప్పుడు హెడ్మాస్టర్స్, ఎంఈవోలు పర్యవేక్షణ చేయనున్నారు.
- ఆన్లైన్ శిక్షణ..
మేడ్చల్-మాల్కాజ్గిరి జిల్లాలో 1600 మంది ఉపాధ్యాయులు మంగళవారం నుంచి నిష్ఠ శిక్షణాతరగతులకు హాజరుకానున్నారు. జిల్లాలో 108 జిల్లాపరిషత్ పాఠశాలలు, 22 యూపీఎస్ పాఠశాలలున్నాయి. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. పిల్లల్లో కళాత్మక, సృజనాత్మకత పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఎలాంటి ప్రణాళికలను రూపొందించాలనే ప్రధాన లక్ష్యంతో నిష్ఠ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని జిల్లా విద్యాధికారి ఎన్ఎ్సఎస్ ప్రసాద్ తెలిపారు.