వరుసగా రెండోసారి.. చరిత్ర సృష్టించిన సింధు
ABN , First Publish Date - 2021-08-02T01:12:48+05:30 IST
ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలన్న స్వప్నం నెరవేరనప్పటికీ ధైర్యం సడలనివ్వని భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు
టోక్యో: ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలన్న స్వప్నం నెరవేరనప్పటికీ ధైర్యం సడలనివ్వని భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం కోసం నేడు జరిగిన పోరులో విజయం సాధించి దేశానికి మరో పతకాన్ని అందించింది. సెమీస్లో భాగంగా నిన్న ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్తో జరిగిన పోరులో పోరాడి ఓడిన సింధు నేడు హి బింగియావోతో జరిగిన మహిళల సింగిల్స్ పోరులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించి ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకాన్ని సాధించిపెట్టింది.
టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను దేశానికి తొలి పతకం అందించగా, సింధు రెండో పతకం అందించింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. బ్యాడ్మింటన్లో భారత్కు రజతం రావడం అదే తొలిసారి. సింధుకు అదే తొలి ఒలింపిక్స్. తాజాగా, టోక్యో ఒలింపిక్స్లోనూ పతకం సాధించిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ వరుస ఒలింపిక్స్లలో భారత్కు పతకాన్ని అందించిన అథ్లెట్గా రికార్డులకెక్కింది.
2014లో ఆసియన్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించడంతో సింధు పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్లో సింధు కాంస్య పతకాలు సాధించింది. ఆ ఏడాది ఏకంగా 5 పతకాలు కొల్లగొట్టింది.
నిజానికి 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో సింధు ఫేవరెట్ కాకపోయినప్పటికీ అనూహ్యంగా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆ గేమ్లో మారిన్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ బ్యాడ్మింటన్లో భారత్కు రజతం అందించిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అయితే, ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి పతకం అందించింది మాత్రం సైనా నెహ్వాలే. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సైనా కాంస్యం గెలుచుకుంది.