వరల్డ్ టాప్ అథ్లెట్ల ‘లైవ్ వర్కవుట్’లో సింధు
ABN , First Publish Date - 2020-06-20T08:24:35+05:30 IST
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇష్టమైన వర్క వుట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఈనెల 23న సింధు ప్రత్యక్షంగా పాల్గొనే వర్కవుట్ సెషన్ను చూడండి. అవును.. ఒలింపిక్ డే రన్ సందర్భం గా ఆరోజు విశ్వవ్యాప్తంగా 22 మంది
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇష్టమైన వర్క వుట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఈనెల 23న సింధు ప్రత్యక్షంగా పాల్గొనే వర్కవుట్ సెషన్ను చూడండి. అవును.. ఒలింపిక్ డే రన్ సందర్భం గా ఆరోజు విశ్వవ్యాప్తంగా 22 మంది టాప్ అథ్లెట్లతో లైవ్ వర్కవుట్ సెషన్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) ఏర్పాటు చేస్తోంది. భారత కాలమానం ప్రకారం ఆరోజు ఉదయం 11 గంటలకు ఈ లైవ్ సెషన్ జరగనుంది. హైదరా బాద్లోని తన ఇంటి నుంచి లైవ్లో పాల్గొనే సింధు.. తనకిష్టమైన వర్కవుట్ను చేసి చూపించనుంది. ఈ సెషన్లో సింధుతో పాటు భారత్ తరఫున స్టార్ రెజ్లర్, కామన్వెల్త్, ఆసియా క్రీడల చాంపియన్ వినేశ్ ఫొగట్ కూడా కనపడనుంది. 22 మంది ఒలింపియన్లు తమకిష్టమైన వర్కవుట్లు చేసే ఈ లైవ్ సెషన్ను ఒలింపిక్ చానెల్లో తిలకించవచ్చు. ‘కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా లాక్డౌన్ కావడం, ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ వాయిదా పడడంతో 50 దేశాలకు చెందిన 5వేల మంది ఒలింపియన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒలింపిక్ డే రన్ సందర్భంగా నిర్వహిస్తున్న అథ్లెట్ల వర్కవుట్ లైవ్ సెషన్తో అందరికీ ఆరోగ్యం అన్న నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. మా ఈ కార్యక్రమంలో మీరంతా కలిసిరావాలి’ అని ఐఓసీ విడుదల చేసిన ప్రకటనలో అధ్యక్షుడు థామస్ బాచ్ పిలుపునిచ్చారు.