వియత్నాం మహిళపై లైంగిక వేధింపులు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు!

ABN , First Publish Date - 2021-04-02T15:32:43+05:30 IST

పనిచేసే చోట వియత్నాం మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం నాలుగు వారాల జైలు, 8వేల సింగపూర్ డాలర్ల(రూ.4.36లక్షలు) జరిమానా విధించింది.

వియత్నాం మహిళపై లైంగిక వేధింపులు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు!

సింగపూర్ సిటీ: పనిచేసే చోట వియత్నాం మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం నాలుగు వారాల జైలు, 8వేల సింగపూర్ డాలర్ల(రూ.4.36లక్షలు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ధంధయుతం ఎజిలాన్(48) అనే భారత వ్యక్తి తన ఆఫీస్‌లో క్లీనర్‌గా పనిచేసే 21 ఏళ్ల వియత్నాం మహిళపై కన్నేశాడు. ఫోన్ ద్వారా పలుమార్లు ఆమెకు అసభ్యకర సందేశాలు పంపించాడు. దానికి ఆమె స్పందించకపోవడంతో ఓ రోజు టాయిలెట్స్ క్లీన్ చేస్తున్న సమయంలో ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. ఎజిలాన్ నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసింది. ఆమె ఫిర్యాదుతో ఎజిలాన్‌ను విచారించిన అధికారులు అతడ్ని పని నుంచి తొలగించారు.


అనంతరం బాధితురాలు గతేడాది ఆగస్టు 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అదే రోజు సాయంత్రం పోలీసులు ఎజిలాన్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతడి ఫోన్‌లో 50 వరకు అశ్లీల వీడియోలను గుర్తించారు. దీంతో అతడిపై మహిళలపై లైంగిక వేధింపులు, మొబైల్‌లో అశ్లీల వీడియోలను కలిగి ఉండడం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో ఎజిలాన్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం నాలుగు వారాల జైలు, రూ. 4.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.   

Updated Date - 2021-04-02T15:32:43+05:30 IST