సింగ‌పూర్‌లో ప్ర‌ముఖ‌ ఆల‌య పూజారి అరెస్ట్ !

ABN , First Publish Date - 2020-08-02T18:39:00+05:30 IST

సింగపూర్‌లోని పురాతన హిందూ దేవాలయ ప్రధాన పూజారిని దొంగ‌త‌నం ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సింగ‌పూర్‌లో ప్ర‌ముఖ‌ ఆల‌య పూజారి అరెస్ట్ !

సింగ‌పూర్ సిటీ: సింగపూర్‌లోని పురాతన హిందూ దేవాలయ ప్రధాన పూజారిని దొంగ‌త‌నం ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆల‌యానికి సంబంధించిన బంగారు ఆభ‌ర‌ణాల మిస్సింగ్ కేసులో శ్రీ మరియమ్మన్ ఆలయం ప్ర‌ధాన పూజారిని సింగ‌పూర్ పోలీసులు శ‌నివారం అదుపులోకి తీసుకున్నారు. పుజారి అధీనంలో ఉండే బంగారు ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌కపోవ‌డంతో ఆల‌య క‌మిటీ ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్ర‌తిరోజూ పూజ‌ల‌ కోసం తరచూ ఉపయోగించే బంగారు ఆభరణాలను ఆలయ లోపలి గర్భగుడిలో ప్రధాన పూజారి అధీనంలో ఉంచుతారు. బంగారు ఆభరణాలను భౌతికంగా లెక్కించేలా రెగ్యులర్ ఆడిట్ చేస్తారు. 


అయితే, ఇలా ఆడిట్ చేసిన స‌మ‌యంలో కొన్ని బంగారు ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌కపోవ‌డంతో పూజారిని ఆల‌య క‌మిటీ ప్ర‌శ్నించింది. దాంతో కొద్దిసేప‌టి త‌ర్వాత ఆయ‌న ఆ ఆభ‌ర‌ణాల‌ను తెచ్చి ఇచ్చారు. ఈ విష‌యంలో ఇత‌ర వ్య‌క్తుల ప్ర‌మేయం లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ఆల‌య క‌మిటీ ప్ర‌ధాన పూజారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆలయ సేవకుడిగా ఉంటూ నమ్మకాన్ని ఉల్లంఘించిన ఆరోప‌ణ‌ల‌పై పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం బెయిల్‌పై ఆయ‌న‌ను విడిచి పెట్టారు. ప్ర‌స్తుతం పోలీసులు ఈ కేసుపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆల‌య క‌మిటీ ఈ విష‌య‌మై హిందూ ఎండోమెంట్స్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.  

Updated Date - 2020-08-02T18:39:00+05:30 IST