సింగపూర్ తెలుగు సమాజం వారి 'STS కనెక్ట్స్' ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-07T14:11:13+05:30 IST

సింగపూర్‌లో నివశించే వారి ప్రయోజనం కోసం అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందించే ఉద్దేశంతో నవంబర్ 6న 'STS కనెక్ట్స్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది సింగపూర్ తెలుగు సమాజం.

సింగపూర్ తెలుగు సమాజం వారి 'STS కనెక్ట్స్' ప్రారంభం

సింగపూర్ సిటీ: సింగపూర్‌లో నివశించే వారి ప్రయోజనం కోసం అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందించే ఉద్దేశంతో నవంబర్ 6న 'STS కనెక్ట్స్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది సింగపూర్ తెలుగు సమాజం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సింగపూర్ బ్యాంక్ “డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్” గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పీయూష్ గుప్త హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వివిధ టెక్నాలజీ అంశాలు, భవిష్యత్తులో రానున్న సాంకేతిక పరిణామాలు, దానికి మనందరం ఎలా సిద్ధంగా ఉండాలి అనే విషయాలపై మాట్లాడారు.  


అలాగే క్రిప్టో, డిజిటల్ కరెన్సీలపై కూడా చర్చించారు. ముఖ్యంగా యువతకు మార్గనిర్ధేశం, స్ధిరత్వం, సమతూల్యత, జాతీయ సమగ్రత, గ్లోబర్ వార్మింగ్, సామన్యుల తలసరి ఆదాయం పెంచుకోవడానికి సూచనలు వంటి వివిధ విభిన్న అంశాలతో కూడిన “ఫైర్ సైడ్ చాట్ విత్ పీయూష్ గుప్తా” శీర్షికతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చక్కగా నిర్వహించారు. తదనంతరం వివిధ అంశాలపై వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు అంతర్దృష్టితో అత్యంత ఆలోచనా భరితంగా పీయూష్ గుప్తా చర్చించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆద్యంతం మంత్రముగ్ధులను చేసింది.


ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, భవిష్య ప్రణాళికతో పాటు అవసరాన్ని ప్రారంభోపస్యాసంలో వివరించారు. STS KONNECTS అనే కార్యక్రమాన్ని పీయూష్ గుప్త సమక్షంలో అందరి వీక్షకుల నడుమ లాంచనంగా ఆవిష్కరించారు. సుమారు 20 సంస్ధల సహకారంతో నిర్వహించబడుతున్న ఈకార్యక్రమంలో పాల్గొని సాంకేతిక అంశాల అవగాహనతో పాటు, జాతీయ సమగ్రతను పెంపొందిచుకొని అంతిమ ప్రయోజనాన్ని పొందాలని కోరారు.


ఈకార్యక్రమానికి వాఖ్యతగా కార్యదర్శి సత్య చిర్ల వ్యవహరించారు. ప్రతి నెల ఒక్కొ సాంకేతిక అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సింగపూర్ తెలుగు సమాజం సహకారం అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 1000 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పీయూష్ గుప్తాతో పాటు మిగతా అతిధులకు, నందితా బన్నాకు, వివిధ సంస్ధల కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలుగుసమాజం కార్యవర్గానికి, వివిధ మాద్యమాల ద్వారా హాజరైన వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. 


ఈ శీర్షికలో డిసెంబర్ 4న సైబర్ సెక్యూరిటీపై పేపాల్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోరమ్ మెహతాతో పాటు జనవరిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై లజాడా డేటా అండ్ ఎంటర్పైజ్ ఇంటలిజెన్స్ హెడ్ ముని వినయ్‌లతో అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంపై  వీక్షకులు, నిపుణుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం తమ నైపుణ్యాలని పెంచుకోవటానికి, తద్వారా కెరీర్ పరంగా ముందుకెళ్లటానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తదుపరి కార్యక్రమం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు.


Updated Date - 2021-11-07T14:11:13+05:30 IST