11 దేశాల పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్న సింగపూర్.. భారతీయులకు మాత్రం..
ABN , First Publish Date - 2021-10-12T03:08:00+05:30 IST
కరోనా కారణంగా కుదేలైన పర్యాటకాన్ని లేవనెత్తేందుకు పలు దేశాల ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. విదేశీ ప్రయాణికులకు క్రమంగా ఆహ్మానం పలుకుతున్నాయి. తాజాగా సింగపూర్.. 9 దేశాల ప్రయాణికులకు ఆహ్మానం పలికేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా కుదేలైన పర్యాటకాన్ని లేవనెత్తేందుకు పలు దేశాల ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా సింగపూర్.. 9 దేశాల ప్రయాణికులను కరోనా ఆంక్షలు లేకుండా ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్ల్యాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా, కెనడా, దేశాల ప్రజలు ఇకపై సింగపూర్ చేరుకున్నాక క్వారంటైన్లో గడపాల్సిన అవసరం లేదని పేర్కొంది. గత వారం అక్కడి ప్రభుత్వం ఈ ప్రకటన చేయగా.. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 19 నుంచి అమల్లోకి రానుంది.
అంతకుమునుపే జర్మనీ, బ్రూనై పర్యాటకుల కోసం సింగపూర్ ప్రభుత్వం వ్యాక్సినేటెడ్ ట్రావల్ లేన్(వీటీఎల్) పేరిట ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానంలో దేశంలోకి ప్రవేశించే వారు ఇతరులకు వలెనే ముందుగా 14 రోజుల క్వారంటైన్లో గడపాల్సిన అవసరం లేదు. అయితే.. సింగపూర్ ప్రభుత్వం తాజాగా ఈ సదుపాయాన్ని మరో తొమ్మిది దేశాల వారికి వర్తింపజేసింది. అంతేకాకుండా.. నవంబర్ 14 నుంచి దక్షిణకొరియా ప్రజలు కూడా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.
2019 నాటి లెక్కల ప్రకారం.. చైనా, ఇండోనేషియా, భారత్ దేశాల వారే అత్యధిక సంఖ్యలో సింగపూర్లో పర్యటించారు. కానీ.. భారతీయులకు సింగపూర్ ఇంకా వీటీఎల్ సదుపాయాన్ని కల్పించలేదు. అయితే.. పర్యాటక రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో.. సింగపూర్ ప్రభుత్వం అతి త్వరలోనే భారతీయులకూ ఈ సౌలభ్యాన్ని కల్పించే అవకాశం ఉంది.