భార‌తీయురాలిపై జాతి విద్వేష వ్యాఖ్య‌లు.. సింగ‌పూర్ మ‌హిళ‌కు జైలు!

ABN , First Publish Date - 2021-06-24T18:44:13+05:30 IST

భార‌త సంత‌తి మ‌హిళ‌పై జాతి విద్వేష వ్యాఖ్య‌లు చేసిన సింగపూర్ మ‌హిళ‌కు బుధ‌వారం ఆ దేశ న్యాయ‌స్థానం 4 వారాల జైలు శిక్ష విధించింది.

భార‌తీయురాలిపై జాతి విద్వేష వ్యాఖ్య‌లు.. సింగ‌పూర్ మ‌హిళ‌కు జైలు!

సింగ‌పూర్ సిటీ: భార‌త సంత‌తి మ‌హిళ‌పై జాతి విద్వేష వ్యాఖ్య‌లు చేసిన సింగపూర్ మ‌హిళ‌కు బుధ‌వారం ఆ దేశ న్యాయ‌స్థానం 4 వారాల జైలు శిక్ష విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 3న ఓ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సితి అయేషా జ‌ఫ్పార్ అనే సింగ‌పూర్ మ‌హిళ‌.. బ‌స్సులో త‌న ఎదుట కూర్చున్న భార‌తీయురాలిని ఉద్దేశిస్తూ స్టూపిడ్ ఇండియ‌న్ అని సంభోదించింది. కానీ, ఆ స‌మ‌యంలో భార‌తీయ మ‌హిళ త‌న చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకోవ‌డంతో ఆమెకు స‌రిగ్గా వినిపించ‌లేదు. దాంతో అనుమానం వ‌చ్చిన భార‌తీయురాలు తాను వింటున్న మ్యూజిక్‌ను ఆఫ్ చేసి, ఆమె చెబుతుంది విని షాక్ అయింది.


"భార‌తీయులు న‌ల్ల‌వారు. వారి చ‌ర్మం నల్ల‌గా ఉంటుంది. నాకు న‌లుపు అంటే తెగ చిరాకు. నీవు నీ బ్లాక్ మ్యాజిక్ ఫేస్‌, భార‌తీయుల గుండెతో పాటు అన్నీ న‌లుపే. నీవు ఇండియ‌నే క‌దా. అందుకే నీవు కూడా న‌ల్ల‌గా ఉన్నావు. అందుకే నీ చ‌ర్మం రంగు అంటే నాకిష్టం లేదు. నీ మోహం నాకు అస్స‌లు న‌చ్చ‌డం లేదంటూ" నోటికి వ‌చ్చిన ప‌దాల‌తో భార‌తీయురాలిపై విరుచుకుప‌డింది. అంత‌టితో ఆగ‌కుండా "నీ స్వ‌స్థ‌లం ఇండియా. సింగ‌పూర్ కాదు. తిరిగి ఇండియాకు వెళ్లిపో" అని చెప్పింది. సితి అయేషా జ‌ఫ్పార్ త‌న‌పై చేసిన‌ జాతి విద్వేష వ్యాఖ్య‌ల‌ను భార‌త సంత‌తి మ‌హిళ త‌న సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. అనంత‌రం దాని ఆధారంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ కేసు సింగ‌పూర్ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. బాధితురాలు స‌మ‌ర్పించిన రెండు వీడియో క్లిప్పుల‌ను చూసిన జ‌డ్జి తాన్ జెన్ సే.. సితి అయేషా జ‌ఫ్పార్ చేసింది నేర‌మ‌ని తేల్చారు. మ‌న అతిథుల‌పై ఇలా జాతి విద్వేష వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని ఆమెను హెచ్చ‌రించారు. అనంత‌రం ఆమెకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.  

Updated Date - 2021-06-24T18:44:13+05:30 IST