చెత్త డంపింగ్‌కు సింగరేణి బ్రేకులు

ABN , First Publish Date - 2022-01-22T05:59:51+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ చెత్త డంపింగ్‌ను సింగరేణి అడ్డుకున్నది.

చెత్త డంపింగ్‌కు సింగరేణి బ్రేకులు
సింగరేణి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది

- డంపింగ్‌ యార్డు పొగతో ఇబ్బందులంటూ అభ్యంతరం 

- ప్రత్యామ్నాయ స్థలం చూసుకోవాలని సూచన

- మూడు గంటల పాటు నిలిచిన వాహనాలు 

కోల్‌సిటీ, జనవరి 21: రామగుండం నగరపాలక సంస్థ చెత్త డంపింగ్‌ను సింగరేణి అడ్డుకున్నది. శుక్రవారం ఫైవింక్లయిన్‌ వద్ద నగరపాలక సంస్థకు చెందిన చెత్తను తరలించే ట్రాక్టర్లను, ట్రాలీలను సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేశారు. దీంతో  మూడు గంటల పాటు పారిశుధ్య వాహనాలు నిలిచిపోయాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆర్‌జీ-2కు చెందిన ఎస్టేట్‌ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కేవలం వాహనాల్లో ఉన్న చెత్తను మాత్రమే డంప్‌చేయాలని, మరోసారి తీసుకురావవద్దని కరాఖండిగా చెప్పారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థకు జల్లారం శివారులో 10ఎకరాల స్థలాన్ని సింగరేణి సంస్థ కేటాయించింది. గోదావరిఖని, యైుటింక్లయిన్‌కాలనీ, ఎన్‌టీపీసీ నుంచి చెత్తను ఈ డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, స్వచ్ఛఆటోలు, కంపాక్టర్లు, డంపర్‌ ప్లేసర్ల ద్వారా చెత్తను ఈ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం డంపింగ్‌ యార్డు నిండింది. డంపింగ్‌ యార్డు కేటాయించినప్పటి నుంచి సింగరేణి ఆర్‌జీ-2 అధికారులు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు. గతంలో తమకు కేటాయించిన స్థలం దాటి చెత్తను డంపింగ్‌ చేశారంటూ కార్పొరేషన్‌ వాహనాలను సింగరేణి సీజ్‌ చేసింది. ఇప్పుడు డంపింగ్‌ యార్డు నుంచి వెలువడే పొగవల్ల ఓసీపీ-3 ప్రాజెక్టు పైన పొగ కమ్ముకుంటోందని, తమ వాహనాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ సింగరేణి యాజమాన్యం పేర్కొంటోంది. డంపింగ్‌ యార్డుకు వెళ్లకుండా వాహనాలను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. 

Updated Date - 2022-01-22T05:59:51+05:30 IST