‘సింగరేణిలో తెలంగాణ అధికారులకు అన్యాయం’
ABN , First Publish Date - 2021-05-10T13:03:10+05:30 IST
నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల డిమాండ్తో
- సింగరేణి సీఎండీ శ్రీధర్కు ఫిర్యాదుచేసిన జాజుల
హైదరాబాద్/కవాడిగూడ : నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల డిమాండ్తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సింగరేణి ఉద్యోగులు చారిత్రాత్మమైన పోరాటం చేశారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సింగరేణిలో పదోన్నతుల విషయంలో తెలంగాణ సింగరేణి అధికారులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం సింగరేణి సీఎండీ శ్రీధర్కు సింగరేణి తెలంగాణ అధికారులకు పదోన్నతులపై జరుగుతున్న అన్యాయంపై శ్రీనివాస్గౌడ్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన ఇందిరాపార్కు చౌరస్తాలోని బీసీ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో అతికీలకమైన జనరల్ మేనేజర్ పదవులను ఆంధ్రా అధికారులకు అక్రమంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన అధికారికి జీఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఈ పదవిని వెంటనే రద్దు చేసి, తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాలని, లేనిపక్షంలో సీఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.