సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం లోయర్‌ మానేరు డ్యాంలో సింగరేణి సర్వే

ABN , First Publish Date - 2021-10-22T06:14:09+05:30 IST

కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు జలాశయంలో సింగరేణి నిర్మించనున్న తేలియాడే సోలార్‌ ప్లాంట్‌ కోసం గురువారం సింగరేణి సర్వే ప్రారంభించింది.

సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం లోయర్‌ మానేరు డ్యాంలో సింగరేణి సర్వే
మానేరు జలాశయాన్ని పరిశీలిస్తున్న అధికారులు

గోదావరిఖని, అక్టోబరు 21: కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు జలాశయంలో సింగరేణి నిర్మించనున్న తేలియాడే సోలార్‌ ప్లాంట్‌ కోసం గురువారం సింగరేణి సర్వే ప్రారంభించింది. సంస్థ డైరెక్టర్‌(ఇంజనీరింగ్‌ మెకానికల్‌) సత్యనారాయణరావు సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు సర్వే చేయ నున్న సంస్థ ఏరిసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి బోటులో మానేరు డ్యాంను పరిశీలించారు. 250 మెగావాట్ల(డీసీ) నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్‌ సంస్థ ద్వారా జలాశయంలో వివిధ అంశాలపై సర్వే నిర్వహిస్తు న్నట్టు, నెల రోజుల్లో సర్వే పూర్తవుతుందని అన్నారు. సర్వే అనం తరం సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణ శైలిని రూపొందిస్తామని తెలిపారు. సర్వేలో భాగంగా జలాశయంలో నీటి పరిమాణం, నీటి వేగం వంటి అంశాలను పరిశీలించే హైడ్రోగ్రాఫిక్‌ సర్వే, నీటి అడుగు భాగంలోని భూమి ఎత్తుపల్లాలను పరిశీలించే బ్యాతిమెట్రిక్‌ సర్వే, నీటి కింద భూమి పొరల స్థితిగతులను అధ్యయనం చేసే బెడ్‌ సాయిల్‌ సర్వేలను ఏరిసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థ నిర్వహించనున్నట్టు తెలిపారు. వీటి ఆధారంగా ప్లాంట్‌ను జలాశయంలో ఎక్కడ, ఏయే కొలతలతో ఏర్పాటు చేయాలనేది నిర్ధారించనున్నట్టు తెలిపారు. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు నీటిపై తేలియాడేది అయినప్పటికి స్థిరంగా ఉంచడం కోసం ప్లాంట్‌కు నలువైపులా భూమిలోపల లంగర్‌ వేసి ఉంచడానికి ఏర్పాట్లు చేయడానికి సైతం సర్వే ఉపయోగపడుతుం దని అన్నారు. సింగరేణి సంస్థ మానేరు జలాశయం నీటిపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇరిగేషన్‌, మత్స్య శాఖలు సానుకూలత వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించగానే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా నిర్మాణ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించనున్నది. ప్లాంటు పూర్తయితే దేశంలోనే జలాశయం నీటిపై తేలియాడే తొలి ప్లాంటుగా నెలకొల్పిన సంస్థగా సింగరేణి నిలవనున్నది. మానేరు డ్యాంను పరిశీలించిన వారిలో డీజీఎం (ఈఅండ్‌ఎం) ఎస్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఈ నటరాజప్రసాద్‌, ఏరిసిస్‌ ప్రతినిధులు నవీన్‌, కే వర్మలు ఉన్నారు. 

Updated Date - 2021-10-22T06:14:09+05:30 IST