Sirivennelaకు ఘనంగా నివాళి

ABN , First Publish Date - 2021-12-02T18:44:17+05:30 IST

ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నగరంలోని తెలుగు విజ్ఞాన సమితి బుధవారం రాత్రి ఘనంగా నివాళులర్పించింది. శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో జరిగిన సంతాపసభకు సమితి అధ్యక్షుడు డాక్టర్‌

Sirivennelaకు ఘనంగా నివాళి

బెంగళూరు: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నగరంలోని తెలుగు విజ్ఞాన సమితి బుధవారం రాత్రి ఘనంగా నివాళులర్పించింది. శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో జరిగిన సంతాపసభకు సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఏ రాధాకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ చంద్రశేఖర్‌ కంబార చేతులమీదుగా సమితి ఆధ్వర్యంలో ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రికి డాక్టర్‌ సినారె పురస్కారాన్ని అందచేసి ఘనంగా సత్కరించిన సంగతిని గుర్తు చేశారు. సిరివెన్నెల అస్తమయంతో సినీపాటల ప్రపంచంలో చీకట్లు ఆవరించాయన్నారు. చందనసీమతో సిరివెన్నెలకు ఉన్న అవినాభావ సంబంధాలను స్మరించుకున్నారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలన్నీ ప్రేక్షకుల హృదయాల్లో కలకాలం ఉండిపోతాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకుముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షులు ఏ గంగరాజు, ఆర్‌ ఆదికేశవులునాయుడు, కోశాధికారి సీఏ వరదరాజుతోపాటు పదాదికారులు, కార్యవర్గ సభ్యులు సంతాపసభలో పాల్గొన్నారు. సిరివెన్నెల మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

Updated Date - 2021-12-02T18:44:17+05:30 IST