సత్యసాయి సేవలో తరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
ABN , First Publish Date - 2021-12-01T06:06:29+05:30 IST
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి విశాఖ మన్యంతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుంది.
మన్యంతో పెనవేసుకున్న అనుబంధం
పాడేరు, నవంబరు 30: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి విశాఖ మన్యంతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుంది. ఆయన మృతి చెందడంతో గిరిజన ప్రాంతంతో ఆయనకున్న అనుబంధాన్ని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రత్యేక భజనలు, నీటి పథకాల ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలకు సిరివెన్నెల హాజరయ్యేవారు. ఆయన వచ్చిన సంగతి సైతం మీడియాకు తెలియకుండా ఉండేవారు. ఏజెన్సీలో పాడేరు మండలం తుంపాడ, రాములపుట్టు, వంట్లమామిడి, హుకుంపేట మండలం బాకూరు, భీమ వరం, పెదబయలు మండలం కిముడుపల్లి, పెదకోడాపల్లి ప్రాంతాల్లో సత్యసాయి ట్రస్ట్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొన్నారు.