‘సీతారామ’కు భూసేకరణ వేగిరం చేయాలి
ABN , First Publish Date - 2020-05-19T10:45:36+05:30 IST
సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణ పెండింగ్ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ అధికారులను ఆదేశించారు.
అధికారులతో ఖమ్మం కలెక్టర్ సమీక్ష
ఖమ్మం కలెక్టరేట్, మే18: సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణ పెండింగ్ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారులు, ఆయా మండలాల తహాసీల్దార్లు, ఎన్నెస్పీ, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టు భూసేకరణ పనులపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో భూసేకరణ పూర్తి చేసినట్లు సత్తుపల్లి మండలం యాతాలకుంటలో ఇంకా చేయాల్సి ఉందన్నారు.
ఈ ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాలేరు లింక్ కెనాల్ కోసం ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోనూ భూ సేకరణ ప్రక్రియను తక్షణమే చేపట్టి గ్రామాల్లో సర్వే నెంబర్లు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని సంబందిత తహాసీల్దార్లను కలెక్టర్ ఆదేశిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాధ్, కల్లూరు ఆర్డీవో దశరథ్, సీతారామ ప్రాజెక్టు ఎన్నెస్పీ ఈఈలు, సత్తుపల్లి, కూసుమంచి తిరుమలాయపాలెం, సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.