షాపుల చెంతనే సిట్టింగ్‌!

ABN , First Publish Date - 2022-01-15T04:14:03+05:30 IST

సర్కారు మద్యం దుకాణాల పరిసరాలు మినీ బార్లుగా మారాయి. అక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు, బడ్డీ కొట్ల వద్ద మందుబాబులు

షాపుల చెంతనే సిట్టింగ్‌!

ఉదయగిరి, జనవరి 14: సర్కారు మద్యం దుకాణాల పరిసరాలు మినీ బార్లుగా మారాయి. అక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు, బడ్డీ కొట్ల వద్ద మందుబాబులు సిట్టింగ్‌ వేసి చీర్స్‌ చెప్పుకుంటున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వమే వైన్‌ షాపులను నడుపుతోంది. అయితే అక్కడ సిట్టింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలు గాలికొదిలేసి మద్యం దుకాణాల చెంతనే సిట్టింగ్‌ ప్రాంతాలు వెలిశాయి. అక్కడ బడ్డీ కొట్లలో మద్యం సేవించేందుకు అవసరమైన గ్లాసులు, వాటర్‌ ప్యాకెట్లు, సోడా, తినుబండారాలు కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న సిట్టింగ్‌ ప్రాంతాల్లో దర్జాగా మద్యం సేవిస్తున్నారు. ఉదయగిరిలో మూడు, సీతారామపురం, పెద్దిరెడ్డిపల్లి, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల సమీపాల్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో ఎక్కువ మంది అక్కడే సిట్టింగ్‌ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్ల వెంబడి పొలాలు, చెట్ల పొదలు అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. దీంతో అటు వైపుగా మహిళలు పోవాలంటే భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం దుకాణాల సమీపంలోని పొలాల్లో మద్యం సేవించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-15T04:14:03+05:30 IST